గుడ్న్యూస్ : కరోనాపై పోరుకు రోగ నిరోధక శక్తిని పెంచే స్వీట్.!
By న్యూస్మీటర్ తెలుగు Published on 29 Jun 2020 10:44 AM GMTస్వీట్లను ఎక్కువగా ఇష్టపడే బెంగాలీలకు ఓ శుభవార్త. కరోనాపై పోరుకు అవసరమైన రోగ నిరోధక శక్తిని పెంచే స్వీట్లను మార్కెట్లోకి అందుబాటులోకి తేనున్నట్లు ఆ రాష్ట్ర అధికారులు పేర్కొన్నారు. ప్రసిద్ది చెందిన సుందర్భన్ అడవుల్లోంచి సేకరించిన తేనె, స్వచ్ఛమైన ఆవు పాలు, తులసీరసంతో తయారుచేసిన ఈ మిఠాయికి 'ఆరోగ్య సందేశ్'గా నామకరణం చేశారు.
జంతు వనరుల అభివృద్ధి శాఖ అధికారి ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పూర్తిగా సహజసిద్ద పద్ధతిలో దీన్ని తయారు చేశారని, ఇందులో ఎలాంటి కృత్రిమ పదార్థాలు, రంగులు కలపలేదని.. ఈ మిఠాయితో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని అన్నారు. అయితే.. కరోనాకు ఈ మిఠాయి విరుగుడు మందు కాదని, కేవలం రోగ నిరోదక శక్తిని పెంపొందించడంలో మాత్రమే ముఖ్య పాత్ర పోషిస్తుందని అన్నారు.
అయితే.. ఆరోగ్య సందేశ్కు ఇప్పటికే ప్రభుత్వ అనుమతి కూడా లభించింది. దీంతో అతి త్వరలోనే సామాన్యులకు అందుబాటు ధరల్లో లభించనుంది. ఇక జూన్ నెల ప్రారంభంలో ప్రఖ్యాత మిఠాయి తయారీ సంస్థ ఒకటి.. ఇమ్యూనిటీ సందేశ్ పేరుతో ఈ స్వీట్ను తయారుచేసింది. ఇందులో సహజసిద్ధమైన పసుపు, తులసి, కుంకుమ, యాలకులు, తేనే వంటి మూలికలతో దీన్ని సిద్ధం చేయగా... పరిశోధనల అనంతరం దీనికి ప్రభుత్వ గుర్తింపు లభించింది. శాస్ర్తీయంగా.. రోగ నిరోధక శక్తిని పెంచే గుణాలు ఈ మిఠాయిలో ఉన్నట్లు తేలడంతో ప్రభుత్వం ఈ మిఠాయిని మార్కెట్లో అందుబాటులోకి తేనుంది.