పాక్ ఆక్రమిత కాశ్మీర్ విషయంలో మరింత దూకుడు పెంచిన భారత్.!
By న్యూస్మీటర్ తెలుగు Published on 8 May 2020 7:54 AM GMTనరేంద్ర మోదీ ప్రభుత్వం.. కాశ్మీర్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్న సంగతి తెలిసిందే..! పాకిస్థాన్ చేస్తున్న దారుణాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ.. తీవ్రవాదులను మట్టుబెడుతూ ఎన్నో నిర్ణయాలు తీసుకుంటోంది భారత్. తాజాగా పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ విషయంలో భారత ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
భారత వాతావరణ విభాగం ఇక మీదట పీవోకే ప్రాంతాల్లో వాతావరణ సూచనలు జారీ చేయబోతోంది భారత వాతావరణ విభాగం(ఐఎండీ). ప్రస్తుతం పాక్ ఆధీనంలో ఉన్న గిల్గిట్-బాల్టిస్థాన్, ముజఫరాబాద్లో వాతావరణ మార్పులకు సంబంధించిన హెచ్చరికలను జారీ చేయనున్నట్లు ఐఎండీ ప్రకటించింది.
పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతాల్లో ఎన్నికలు నిర్వహించాలని పాక్ సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. గిల్గిట్-బాల్టిస్థాన్ ప్రాంతాలు భారత దేశంలో భాగమని తేల్చి చెప్పింది. తాజాగా వాతావరణ సూచనలు జారీ చేయబోతోతున్నామని తెలియజేస్తూ పాక్ కు కౌంటర్ ఇచ్చింది భారత్.
ముజఫరాబాద్, గిల్గిట్-బాల్టిస్థాన్ ప్రాంతాల్లోనూ వాతావరణ మార్పులకు సంబంధించి సూచనలు జారీ చేయనున్నట్లు ఆర్ఎండీ హెడ్ కుల్దీప్ శ్రీవాత్సవ గురువారం తెలిపారు. ఆ ప్రాంతాలను జమ్మూ-కశ్మీర్ సబ్ డివిజన్లో భాగంగా పరిగణించనున్నట్లు తెలిపారు.
ఇంతకుముందు ముజఫరాబాద్, గిల్గిట్-బాల్టిస్థాన్ ప్రాంతాల్లోనూ వాతావరణ సూచనలు చేసేది. కానీ కొన్ని కారణాల వల్ల ఈ ప్రాంతాల్లో వాతావరణ సూచనలు నిలిపివేసింది. తాజాగా ఈ ప్రాంతాల్లో వాతావరణ సూచనలు చేయాలని నిర్ణయించింది. కాశ్మీర్ పై పాకిస్థాన్ కు ఎటువంటి అధికారాలు లేవని చెప్పడం భారత్ ఉద్దేశ్యంలో భాగమే ఈ వాతావరణ సూచనలు వెల్లడించడమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.