నిఖత్ జరీన్ ను సన్మానించిన రేవంత్ రెడ్డి

Revanth Reddy honored Nikhat Zareen. బాక్సింగ్ చాంపియన్ నిఖత్ జరీన్ కు టీపీసీసీ ఆధ్వర్యంలో హైదరాబాద్ నిజాం క్లబ్ లో సన్మానం జ‌రిగింది.

By Medi Samrat  Published on  8 Jan 2023 12:44 PM GMT
నిఖత్ జరీన్ ను సన్మానించిన రేవంత్ రెడ్డి

బాక్సింగ్ చాంపియన్ నిఖత్ జరీన్ కు టీపీసీసీ ఆధ్వర్యంలో హైదరాబాద్ నిజాం క్లబ్ లో సన్మానం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, షబ్బీర్ అలీ, మహేశ్ కుమార్ గౌడ్, అజారుద్దీన్, ఇతర నేతలు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. నిఖ‌త్ జరీన్ సాధించిన విజయాన్ని గౌరవిస్తూ పార్టీ తరపున 5లక్షలు బహుమతిగా ప్రకటించాము. మేమంతా నిఖ‌త్ జరీన్ తో ఉన్నామని చెప్పేందుకే ఈ బహుమతిని ప్రకటింటిన‌ట్లు తెలిపారు. రాజకీయాలకు అతీతంగా ఉండాలనే నిజాం క్లబ్ లో కార్యక్రమం ఏర్పాటు చేసామ‌ని పేర్కొన్నారు.

క్రీడాకారులను ప్రోత్సహించేందుకే ఈ కార్యక్రమం.. ఇందులో ఎలాంటి ఇతర ఉద్దేశాలు లేవు.. రాజకీయాల్లోనూ క్రీడా స్ఫూర్తి అవసరం.. మగవాళ్ళు ఆడే ఆట అని అడ్డు చెప్పకుండా జరీన్ ను తల్లిదండ్రులు ప్రోత్సహించారు. ఇందుకు నిఖత్ జరీన్ కుటుంబానికి అభినందనలు తెలిపారు. స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నిఖత్ జరీన్ కు స్థలాన్ని కేటాయించాలని ప్ర‌భుత్వాన్ని కోరారు. అన్ని రకాల సౌకర్యాలతో స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. 26 జనవరిలోగా గ్రూప్ 1 ఆఫీసర్ గా నియమించాలని విజ్ఞప్తి చేశారు.మరింత గొప్పగా నిఖత్ జరీన్ ను సన్మానించేలా మరో కార్యక్రమం ఏర్పాటు చేయాలని పార్టీ నేతలకు సూచించారు. లక్షలాదిమంది విద్యార్థులకు క్రీడా స్ఫూర్తిని కలిగించేలా కార్యక్రమాన్ని నిర్వహించాలని అన్నారు.

ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి సన్మానించినందుకు కృతజ్ఞతలు తెలిపారు బాక్సింగ్ చాంపియన్ నిఖత్ జరీన్. టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి బహుమతిని ప్రకటించడం సంతోషంగా ఉంది. అందరి సపోర్ట్ ఉంటే దేశం గర్వించేలా ఆట తీరు కనబరుస్తాన‌ని నిఖత్ జరీన్ పేర్కొంది.


Next Story