అందులో అమిత్ షా, కిషన్ రెడ్డిల పాత్ర లేదు

హైదరాబాద్ లో గత నెలలో జరిగిన ఎన్నికల ప్రచారంలో మైనర్లను ఉపయోగించుకున్నారనే ఆరోపణలపై దాఖలు చేసిన ఫిర్యాదుపై

By Medi Samrat  Published on  3 Jun 2024 2:42 PM GMT
అందులో అమిత్ షా, కిషన్ రెడ్డిల పాత్ర లేదు

హైదరాబాద్ లో గత నెలలో జరిగిన ఎన్నికల ప్రచారంలో మైనర్లను ఉపయోగించుకున్నారనే ఆరోపణలపై దాఖలు చేసిన ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నుండి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, తెలంగాణ బీజేపీ చీఫ్ జి.కిషన్ రెడ్డి పేర్లను నగర పోలీసులు తొలగించారు. మే 1న లాల్‌దవాజా నుంచి సుధా టాకీస్‌ ​​వరకు జరిగిన బీజేపీ ర్యాలీలో షాతో పాటు కొంతమంది మైనర్‌ పిల్లలు కూడా వేదికపై ఉన్నారని టీపీసీసీ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్‌ తెలంగాణ చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌ (సీఈవో)కి ఫిర్యాదు చేశారు. అప్పట్లో అమిత్ షా, కిషన్ రెడ్డి, హైదరాబాద్ లోక్‌సభ బీజేపీ అభ్యర్థి కె మాధవి లత, శాసనసభ్యుడు టి.రాజా సింగ్, బీజేపీ నేత టి.యమన్ సింగ్‌లపై మొదట ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

విచారణ అనంతరం ఈ ఘటనలో అమిత్ షా, కిషన్ రెడ్డిల పాత్ర లేదని తేలిందని పోలీసు అధికారి తెలిపారు. గత వారం స్థానిక కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేసినట్లు అధికారి తెలిపారు. మరో ముగ్గురిపై ఐపీసీ సెక్షన్ 188 కింద కేసు కొనసాగుతుందని అధికారి తెలిపారు.

Next Story