ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అసెంబ్లీ మీడియా హాల్లో దోమతెరతో కుట్టించిన గౌన్ ధరించి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్లో నోరు తెరిస్తే నోట్లోకి దోమలు పోతున్నాయని.. దోమలతో హైదరాబాద్ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. మా హయంలో నాలుగు, ఐదు సార్లు దోమల బెడద లేకుండా చర్యలు తీసుకునే వాళ్ళం.. దోమలపై ఈ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని.. దీని ద్వారా డెంగ్యూ, మలేరియాతో పేద ప్రజలు ఆసుపత్రి పాలవుతున్నారు.. దోమలు అరికట్టలేని ప్రభుత్వం అవసరమా అని ప్రజలు భావిస్తున్నారని అన్నారు.
అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నపుడు మాత్రమే కొన్ని నిబంధనలు ఉంటాయి. దోమల బెడదపై అసెంబ్లీ మీడియా హాల్లో దోమ తెరతో మీడియా సమావేశం ఏర్పాటు చేసుకుంటే మార్షల్స్ అడ్డుకున్నారు. హైదరాబాద్ను మూడు ముక్కలు చేసి మరిన్ని సమస్యలకు కారణం చేశారు. దోమల బెడదకు భయపడి ఎవరూ హైదరాబాద్ రావడం లేదని.. హైదరాబాద్లో దోమల బెడద నివారణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కు మరింత నష్టం జరిగే అవకాశం ఉందన్నారు.
మార్షల్స్ తీరును తీవ్రంగా ఖండిస్తున్నాము.. ప్రతి డివిజన్కు 10 ఫాగింగ్ మిషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రెండేళ్లలో కాంగ్రెస్ పార్టీ ఏం సాధించిందని సంబరాలు చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. హైదరాబాద్ ప్రజలు దోమ తెర కుట్టించుకునే పరిస్థితి కారణం కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు. కరోనా వచ్చినప్పుడు మాస్క్ ఎలా పెట్టుకున్నామో, హైదరబాద్ లో దోమల బెడద తట్టుకోలేక దోమ తెర కుట్టించుకునే పరిస్థితి వచ్చిందన్నారు.