Jubilee Hills: 'కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పాల్సిన టైమొచ్చింది'.. మైనార్టీలతో కేటీఆర్‌

కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీలను మోసం చేసిందని, తన వాగ్దానాలను నెరవేర్చడంలో విఫలమైందని, భారతీయ జనతా పార్టీ (బిజెపి)తో పొత్తు పెట్టుకుందని భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ విమర్శించారు.

By -  అంజి
Published on : 28 Oct 2025 8:12 AM IST

KTR, minoritie, Congress, Jubilee Hills bypoll, Hyderabad

Jubilee Hills: 'కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పాల్సిన టైమొచ్చింది'.. మైనార్టీలతో కేటీఆర్‌

హైదరాబాద్‌: కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీలను మోసం చేసిందని, తన వాగ్దానాలను నెరవేర్చడంలో విఫలమైందని, భారతీయ జనతా పార్టీ (బిజెపి)తో పొత్తు పెట్టుకుందని భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ విమర్శించారు. సోమవారం శంషాబాద్‌లో జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికకు సంబంధించి మైనారిటీ నాయకులతో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని, కాంగ్రెస్ తన మైనారిటీ డిక్లరేషన్ ప్రకటించడానికి సీనియర్ నాయకులను తెలంగాణకు తీసుకువచ్చిందని, మార్పుకు హామీ ఇచ్చిందని అన్నారు. రెండేళ్ల క్రితం, మైనారిటీల సంక్షేమం కోసం ఏటా ₹4,000 కోట్లు కేటాయిస్తామని, మైనారిటీల సబ్-ప్లాన్‌ను ప్రవేశపెడతామని కాంగ్రెస్ చెప్పింది, కానీ రెండు వాగ్దానాలు నెరవేరలేదన్నారు.

కేసీఆర్‌ నేతృత్వంలోని బిఆర్ఎస్ ప్రభుత్వం పేద వధువులకు ₹1 లక్ష ఆర్థిక సహాయం అందించే షాదీ ముబారక్ పథకాన్ని ప్రవేశపెట్టిందని ఆయన గుర్తు చేశారు. ఈ పథకం కింద రూ.1 లక్షతో పాటు 10 గ్రాముల బంగారం కూడా అందిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది, కానీ ఇప్పటివరకు హామీని నెరవేర్చలేదన్నారు.

కేసీఆర్‌.. మైనారిటీల రెసిడెన్షియల్ పాఠశాలలను స్థాపించారని, దీని ద్వారా వందలాది మంది విద్యార్థులు వైద్యులు, ఇంజనీర్లుగా మారారని పేర్కొంటూ, గతంలో BRS ప్రభుత్వం వైద్య కళాశాలల సంఖ్యను నాలుగు నుండి ముప్పై నాలుగుకు పెంచిందని,విదేశాలలో ఉన్నత విద్య కోసం ₹20 లక్షల విలువైన స్కాలర్‌షిప్‌లను ప్రవేశపెట్టిందని కేటీఆర్‌ అన్నారు.

ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తాను మోడీ స్కూల్లో చదువుకున్నానని, చంద్రబాబు కాలేజీలో చదివానని, ఇప్పుడు రాహుల్ గాంధీ కింద పనిచేస్తున్నానని స్వయంగా అంగీకరించారని కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. “మిస్టర్ రాహుల్ గాంధీ 'చౌకీదార్ చోర్ హై' అని అంటుండగా, మిస్టర్ రేవంత్ రెడ్డి మోడీని తన అన్నయ్య అని పిలుస్తున్నారు. రాహుల్ సీబీఐ, ఈడీలను మోడీ జేబు సంస్థలుగా విమర్శిస్తున్నారు, కానీ రేవంత్ కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగిస్తున్నారు” అని ఆయన అన్నారు.

రాబోయే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మైనారిటీలు ఐక్యంగా ఉండి కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పాలని ఆయన విజ్ఞప్తి చేశారు. బీఆర్‌ఎస్ విజయం ఖాయమని, గెలుపు తేడా మాత్రమే ఇంకా నిర్ణయించాల్సి ఉందని అన్నారు.

Next Story