'మాగంటి మరణం బీఆర్ఎస్కు తీరనిలోటు'.. కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి
బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణం పట్ల ఆ పార్టీ అధినేత కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
By అంజి
'మాగంటి మరణం బీఆర్ఎస్కు తీరనిలోటు'.. కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి
హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణం పట్ల ఆ పార్టీ అధినేత కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గోపీనాథ్ మరణానికి చింతిస్తూ తన సంతాపాన్ని ప్రకటించారు. గోపీనాథ్ మరణం పార్టీ కి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో కష్టపడి రాజకీయాల్లో అంచలంచెలుగా ఎదిగిన మాగంటి గోపీనాథ్.. ఎంతో సౌమ్యుడిగా, ప్రజానేతగా పేరు సంపాదించారని తెలిపారు.
జూబ్లీహిల్స్ నియోజక వర్గ ఎమ్మెల్యేగా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ, హైదరాబాద్ నగర సీనియర్ రాజకీయనేతగా మాగంటి తనదైన స్థానాన్ని సంపాదించుకున్నారని కేసీఆర్ మాగంటి జ్ఞాపకాలను స్మరించుకున్నారు. గోపీనాథ్ను కాపాడుకునేందుకు వైద్యులు చేసిన కృషి, పార్టీ తరఫున చేసిన ప్రయత్నాలు ఫలించక పోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మాగంటి గోపీనాథ్ మరణం తో శోకతప్తులైన కుటుంబ సభ్యులు మిత్రులు అభిమానులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి చాలా బాధాకరం అని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆస్ట్రేలియా పర్యటన లో ఉన్న మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. మాగంటి గోపినాథ్ మరణ వార్త తెలుసుకొని ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. గోపీనాథ్ ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్ధిస్తు, ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు.
''జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ గారి అకాల మరణం అత్యంత బాధాకరం. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. వారి మృతి బి ఆర్ ఎస్ పార్టీకి తీరని లోటు. రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చిన వారి జీవితం ఆదర్శం. గోపినాథ్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నాను'' అని బీఆర్ఎస్ నేత హరీశ్ రావు పేర్కొన్నారు.