అక్రమ లక్కీ డ్రా స్కీమ్ రాకెట్‌ను ఛేదించిన పోలీసులు..

Illegal lucky draw scheme busted in Hyderabad. రాచకొండ పోలీస్ స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ అక్రమ లక్కీ డ్రా స్కీమ్ రాకెట్‌ను ఛేదించింది.

By Medi Samrat  Published on  19 Feb 2022 11:31 AM GMT
అక్రమ లక్కీ డ్రా స్కీమ్ రాకెట్‌ను ఛేదించిన పోలీసులు..

రాచకొండ పోలీస్ స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ అక్రమ లక్కీ డ్రా స్కీమ్ రాకెట్‌ను ఛేదించింది. ప్రజలను మోసం చేస్తున్నారనే ఆరోపణలపై ఇద్దరు వ్యక్తులను గురువారం అరెస్టు చేసింది. రూ.2.2 లక్షలు, వెండి బిస్కెట్లు, గాడ్జెట్లు, రూ.25 లక్షల విలువైన ఇతర సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులిద్దరూ నకిలీ ప్రభుత్వ రిజిస్ట్రేషన్ నంబర్‌తో ఎన్‌ఐఎస్‌ఈ ఎంటర్‌ప్రైజెస్‌ను స్థాపించి బహుమతుల ముసుగులో ప్రజలను మోసం చేశారని అధికారులు తెలిపారు.

అరెస్టయిన వ్యక్తులను కుషాయిగూడలోని ఈసీఐఎల్‌లోని కమలా నగర్‌కు చెందిన కాంట్రాక్టర్ షేక్ సలావుద్దీన్ (38), రంగారెడ్డిలోని జల్పల్లిలోని శ్రీరామ్ కాలనీకి చెందిన రియల్టర్ షాహబ్ మీర్ ఖాన్ (43)గా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వీరిద్దరూ బుక్‌లెట్లు, కరపత్రాలు సిద్ధం చేసి విస్తృత ప్రచారం కల్పించి వందలాది మందిని ఈ లక్కీ డ్రాల వైపు ఆకర్షించారు. "16 నెలలపాటు ప్రతి నెలా ఒక్కొక్కరి నుంచి రూ.1,000 వసూలు చేశారు. వారు దాదాపు 3,000 మంది వ్యక్తులను ఈ లక్కీ డ్రాలో నమోదు చేసుకున్నారు. ప్రతి వ్యక్తికి ఈ పథకం కింద బహుమతిని అందజేస్తామని హామీ ఇచ్చారు, "అని ఒక అధికారి తెలిపారు.

కస్టమర్ల నుంచి ప్రీమియం వసూలు చేసేందుకు నిందితులు దాదాపు 35 మంది ఏజెంట్లను కూడా ఏర్పాటు చేసుకున్నారు. ప్రతి నెలా లక్కీ డ్రాలో 12 మంది విజేతలను మాత్రమే ప్రకటిస్తామని తెలిపారు. వ్యాపారం నవంబర్ 2020 నెలలో ప్రారంభించబడింది. జనవరి నెలలో మరొక పథకం ప్రారంభించబడింది. 16 నెలల వ్యాపారం మొత్తం రూ.4.8 కోట్లు పోగు చేసినట్లు తెలుస్తోంది. లక్కీ డ్రాకు సంబంధించి విజేత వివరాలను కూడా వారు వెల్లడించలేదు. బోగస్ విన్నర్ ను కూడా సృష్టించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఫిర్యాదు మేరకు కుషాయిగూడ పోలీసులు వారి కార్యాలయంపై దాడి చేసి నిందితులను పట్టుకున్నారు.


Next Story