1.27 ఎకరాల పార్కు స్థలాన్ని కాపాడిన హైడ్రా
నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఆక్రమణలను హైడ్రా మంగళవారం తొలగించింది.
By - Medi Samrat |
నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఆక్రమణలను హైడ్రా మంగళవారం తొలగించింది. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో సంబంధిత అధికారులతో పరిశీలించిన అనంతరం హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకుంది.
రంగారెడ్డి జిల్లా సరూర్నగర్ మండలం కర్మన్ఘాట్ విలేజ్లోని హస్తినాపురం నార్త్ ఎక్స్టెన్షన్ కాలనీలో 1.27 ఎకరాల పార్కు కబ్జా చేశారంటూ అసోసియేషన్ ప్రతినిధులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. పార్కు స్థలాన్ని లేఔట్లో చూపించి తర్వాత ప్లాట్లుగా విక్రయిస్తున్నారనే ఫిర్యాదును క్షేత్రస్థాయిలో విచారించి ఆక్రమణలను హైడ్రా తొలగించింది. చుట్టూ ఫెన్సింగ్ వేసి హైడ్రా కాపాడినట్టు పేర్కొంటూ బోర్డులు ఏర్పాటు చేసింది.
అలాగే శేరిలింగంపల్లి జోన్ చందానగర్ సర్కిల్ పరిధిలోని గంగారాం కాలనీలో సుభాష్నగర్ పేరిట 1974లో సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్లు లే ఔట్ వేశారు. ఇందులో 700 గజాల స్థలాన్ని ప్రజావసరాలకు కేటాయించారు. పేదలకు ఉద్దేశించిన లే ఔట్లో బడాబాబు పాగా వేశారు. ఆ లేఔట్లో ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాన్ని ప్లాట్లుగా మార్చాడు. ఇలా ఆక్రమణలకు గురైన స్థలాన్ని కాపాడాలని అక్కడి నివాసితులు ప్రజావాణిలో ఫిర్యాదు చేయగా ఆక్రమణలు తొలగించి హైడ్రా ఫెన్సింగ్ వేసింది.