మియాపూర్లో 'హైడ్రా' భారీ ఆపరేషన్..!
మియాపూర్లో హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టింది. ఈ క్రమంలోనే రూ. 3 వేల కోట్లకు పైగా విలువైన ప్రభుత్వ భూమిని కాపాడింది.
By - Medi Samrat |
మియాపూర్లో హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టింది. ఈ క్రమంలోనే రూ. 3 వేల కోట్లకు పైగా విలువైన ప్రభుత్వ భూమిని కాపాడింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం మియాపూర్ విలేజ్ మక్తా మహబూబ్ పేటలో ఆక్రమణలను హైడ్రా తొలగించింది. తద్వారా సర్వే నంబర్ 44లో 15 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. ఇదే సర్వే నంబర్ లో ప్రభుత్వ భూమి ఆక్రమణలకు గురి అవుతున్నట్టు హైడ్రా ప్రజావానికి గతంలో ఫిర్యాదు అందింది. దీంతో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు గతంలోనే 5 ఎకరాలను స్వాధీనం చేసుకున్న హైడ్రా.. అప్పుడే మియాపూర్ - బాచుపల్లి ప్రధాన రహదారికి సమాంతరంగా ఉన్న చెరువు కట్టపై వేసిన 18 షెట్టర్లను హైడ్రా తొలగించింది.
తాజాగా మక్తా మహబూబ్ పేటలోని సర్వే నంబరు 44లోని ప్రభుత్వ భూమికి సంబంధించి అక్రమ రిజిస్ట్రేషన్లతో పాటు.. సంబంధిత సబ్ రిజిస్ట్రార్ సస్పెన్షన్ కు సంబంధించిన వార్తల నేపథ్యంలో హైడ్రా మరోసారి విచారణ చేపట్టింది. ఈ క్రమంలోనే తప్పుడు పత్రాలతో అక్కడి 43 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు హైడ్రా నిర్ధారించుకుంది. 159 సర్వే నంబర్లోని భూమి పత్రాలతో.. సర్వే నంబర్ 44లోని ప్రభుత్వ భూమిలో ఎకరన్నర వరకూ కబ్జా చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసింది. స్వాధీనం చేసుకున్న ప్రభుత్వ భూమి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయడంతోపాటు.. ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ హైడ్రా బోర్డులు ఏర్పాటు చేసింది.