హైదరాబాద్: శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక కేటుగాడు తన చేతివాటం ప్రదర్శించాడు. తనను తాను కస్టమ్స్ అధికారిగా పరిచయం చేసుకుని, తక్కువ ధరకే ఐఫోన్లు ఇప్పిస్తానంటూ మెట్టుగూడకు చెందిన ఓ వ్యాపారిని నమ్మించి రూ.75 వేలు వసూలు చేసి పరారయ్యాడు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లోని వ్యాపారి కూల్ డ్రింక్ షాపు వద్దకు వెళ్లిన నిందితుడు, తన వద్ద జప్తు చేసిన ఐఫోన్లు, బంగారం ఉన్నాయని నమ్మబలికాడు.
రెండు ఐఫోన్లను లక్ష రూపాయలకే ఇస్తానని ఒప్పందం కుదుర్చుకున్నాడు. బాధితుడు నమ్మి ఎయిర్పోర్ట్ డిపార్చర్ ఏరియాకు వెళ్లి నిందితుడికి రూ.75 వేలు నగదు అందజేశాడు. ఫోన్లు తెస్తానని లోపలికి వెళ్లిన వ్యక్తి ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో, మోసపోయానని గ్రహించిన బాధితుడు ఆర్జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. అపరిచిత వ్యక్తులు ఇచ్చే ఇలాంటి ఆఫర్లను నమ్మి మోసపోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా ఉంటే వెంటనే సమీపంలోని పోలీసు అధికారులకు సమాచారం అందించాలని పోలీసులు తెలిపారు.