హైదరాబాద్ను ప్రపంచస్థాయి నగరంగా మారుస్తాం: సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ను దేశంలోనే అత్యంత సురక్షితమైన నగరంగా తీర్చిదిద్దడమే కాకుండా, ప్రపంచస్థాయి నగరంగా మార్చడమే తమ లక్ష్యమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.
By - అంజి |
హైదరాబాద్ను ప్రపంచస్థాయి నగరంగా మారుస్తాం: సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ను దేశంలోనే అత్యంత సురక్షితమైన నగరంగా తీర్చిదిద్దడమే కాకుండా, ప్రపంచస్థాయి నగరంగా మార్చడమే తమ లక్ష్యమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఢిల్లీలో కాలుష్యం, ముంబైలో వరదలు, బెంగళూరులో ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయని, కానీ హైదరాబాద్ వాటన్నింటికంటే మెరుగ్గా, సురక్షితంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం కూకట్పల్లిలో హైడ్రా (HYDRAA) ఆధ్వర్యంలో రూ. 20 కోట్లతో పునరుద్ధరించిన నల్లచెరువును ఆయన ప్రజలకు అంకితం చేశారు. ఎన్నికల వరకు మాత్రమే రాజకీయం ఉండాలని, ఆ తర్వాత కేవలం అభివృద్ధిపైనే దృష్టి సారించాలని సీఎం పిలుపునిచ్చారు.
మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లకు మౌలిక సదుపాయాల కోసం తగినన్ని నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఫ్లైఓవర్లు, రోడ్ల విస్తరణ, ఆట స్థలాల ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. నగర భవిష్యత్తు కోసం మూసీ నది పునరుద్ధరణ మరియు చెరువుల రక్షణ అత్యంత కీలకమని సీఎం నొక్కి చెప్పారు. గతంలో 16 ఎకరాలకు కుంచించుకుపోయిన నల్లచెరువును ఆక్రమణలు తొలగించి మళ్ళీ 30 ఎకరాలకు విస్తరించినట్లు తెలిపారు. ఇక్కడ వాకింగ్, సైక్లింగ్ ట్రాక్లతో పాటు ఆహ్లాదకరమైన ల్యాండ్స్కేపింగ్ను ఏర్పాటు చేశారు.
చెరువుల పునరుద్ధరణ అంటే పేదలను ఇబ్బంది పెట్టడం కాదని, వరదల నుండి నగరాన్ని రక్షించడమేనని సీఎం స్పష్టం చేశారు. ఆక్రమణల తొలగింపులో ఇళ్లు కోల్పోయే అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు, పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. పునరుద్ధరించిన చెరువుల వద్ద మహిళా స్వయం సహాయక సంఘాలకు (SHGs) ఉపాధి కల్పించేలా స్టాళ్లను ఏర్పాటు చేస్తామన్నారు. పాలు, కూరగాయలు, ఇతర నిత్యావసరాల విక్రయాలకు అవకాశం కల్పించడం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు ఆర్థికాభివృద్ధిని జోడిస్తామని వివరించారు.