హైదరాబాద్: పవిత్ర మహాశివరాత్రి పర్వదినాన హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA) బాంబు బెదిరింపుతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సింగపూర్ నుండి హైదరాబాద్ వస్తున్న విమానంలో బాంబు అమర్చినట్లు వచ్చిన సమాచారంతో అధికారులు అత్యంత అప్రమత్తమయ్యారు. నేడు ఉదయం సింగపూర్ నుండి హైదరాబాద్ వస్తున్న విమానానికి సంబంధించి విమానాశ్రయ అధికారులకు ఒక అజ్ఞాత ఈమెయిల్ అందింది. అందులో విమానంలో పేలుడు పదార్థాలు ఉన్నట్లు హెచ్చరికలు ఉన్నాయి.
ఈ సమాచారం అందిన వెంటనే ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ (CISF) మరియు బాంబు స్క్వాడ్ రంగంలోకి దిగాయి. విమానం ల్యాండ్ అయిన వెంటనే దానిని ప్రత్యేక 'ఐసోలేషన్ బే' కు తరలించారు. విమానంలోని ప్రయాణికులందరినీ సురక్షితంగా కిందికి దించి, వారిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే టెర్మినల్లోకి అనుమతించారు. సుమారు గంటల పాటు విమానం లోపల, కార్గో విభాగంలో తనిఖీలు నిర్వహించిన అనంతరం భద్రతా సిబ్బంది ఎలాంటి పేలుడు పదార్థాలు లభ్యం కాలేదని ధృవీకరించారు. దీంతో ఈ బెదిరింపును 'హోక్స్' (నకిలీ బెదిరింపు) గా తేల్చి అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.