హైదరాబాద్: HMDA మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణను అవినీతి అక్రమాలు వదలడం లేదు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇప్పటికే జైలుకు వెళ్లిన ఆయనపై, తాజాగా అధికార దుర్వినియోగానికి సంబంధించి ఏసీబీ మరో కొత్త కేసు నమోదు చేసింది. గచ్చిబౌలికి చెందిన ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
2022లో శివ బాలకృష్ణ పదవిలో ఉన్నప్పుడు, కొంతమంది ప్రైవేట్ వ్యక్తులకు లబ్ధి చేకూర్చేలా మాస్టర్ ప్లాన్లో మార్పులు చేస్తూ GO 170 జారీ చేయించారని ఆరోపణలు ఉన్నాయి. ఈ మార్పుల వల్ల ఫిర్యాదుదారురాలికి చెందిన ప్లాట్ దెబ్బతిందని, ఆమె కోర్టును ఆశ్రయించగా సదరు జీవోపై స్టే కూడా వచ్చింది.
అయినప్పటికీ, తన ప్లాట్లో భవన నిర్మాణ అనుమతులను శివ బాలకృష్ణ కావాలనే తొక్కిపెట్టారని ఆమె ఏసీబీని ఆశ్రయించారు. ప్రాథమిక విచారణలో నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు తేలడంతో, ప్రభుత్వ అనుమతితో ఏసీబీ ఈ కొత్త కేసును ఫైల్ చేసింది. ఈ జీవో వెనుక ఇంకా ఎంతమంది సీనియర్ అధికారుల హస్తం ఉందనే కోణంలో నోట్ ఫైళ్లను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.