కుత్బుల్లాపూర్లో విషాదం
By సుభాష్ Published on 16 April 2020 7:34 AM IST
హైదరాబాద్లోని బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. భార్యాభర్తల మధ్య జరిగిన గొడవల కారణంగా కలత చెందిన దంపతులు ఆత్మహత్యకు ఒడిగట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లాకు చెందిన పోతర్లంక సురేష్ (40), భార్య బిందు (37) కొంత కాలంగా హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో శ్రీనివాసనగర్ సాయిసంతోష్ నిలయంలో నివాసం ఉంటున్నారు.
అయితే సురేష్ అరబిందో ఫార్మాలో ఉద్యోగం చేస్తున్నాడు. వీరికి ఇద్దరు ఆడ పిల్లలు. కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య తరచూ మనస్పర్థలు వచ్చి గొడవలు జరిగేవి. మంగళవారం కూడా వీరిద్దరి మధ్య తీవ్రంగా గొడవలు జరిగినట్లు తెలుస్తోంది. తీవ్ర మనస్థాపానికి గురైన వీరు బుధవారం వేర్వేరు గదిలో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.
వారి కుమార్తె తలుపు కొట్టినా తీయకపోవడంతో కిటికీలోంచి చూడగా, ఇద్దరూ ఉరివేసుకుని విగత జీవులగా వేలాడుతున్నారు. దీంతో కుమార్తె సురేష్ సోదరునికి సమాచారం అందించింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. సోదరుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.