ప్రాణంగా ప్రేమించుకున్నారు.. భార్య మరణాన్నితట్టుకోలేక..

By తోట‌ వంశీ కుమార్‌  Published on  14 July 2020 3:42 AM GMT
ప్రాణంగా ప్రేమించుకున్నారు.. భార్య మరణాన్నితట్టుకోలేక..

వాళ్లిద్దరు ఇరుగుపొరుగున ఉండేవారు. ఈ క్రమంలో ఇద్దరి ప్రేమ చిగురించింది. సంవత్సరం క్రితం పెళ్లి చేసుకున్నారు. వారి ప్రేమకు ప్రతి రూపంగా ఓ బిడ్డ కూడా జన్మించాడు. అయితే.. పండంటి బిడ్డకు జన్మించిన రెండు రోజుల్లోనే భార్య మరణించింది. భార్య మరణాన్ని తట్టుకోలేకపోయిన.. ఆ భర్త కూడా ఈ లోకం విడిచి పోయాడు. ఈ హృదయ విదారకర ఘటన విశాఖ సింహాచలం కొండపైన గిరిజన గ్రామంలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఎనిమిది రోజుల పసికందు తల్లితండ్రులు లేని అనాథగా మిగిలాడు.

స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సింహగిరి గిరిజన గ్రామానికి చెందిన శ్రావణ్‌కుమార్‌(20) పొరిగింట్లో ఉండే.. అంబిక ప్రేమించుకున్నారు. సంవత్సరం క్రితం పెళ్లి చేసుకున్నారు. ఎంతో అన్యోన్యంగా జీవించేశారు. ఈ క్రమంలో అంబిక గర్భం దాల్చింది. ఈ నేపథ్యంలో ఈ నెల6న విశాఖ కేజీహెచ్‌లో చేర్చించారు. ఆమెకు ఫిట్స్‌ రావడంతో సిజేరియన్‌ చేయగా.. మగబిడ్డకు జన్మనిచ్చింది. తీవ్ర అస్వస్థతకు గురై 8వ తేదీన మృతి చెందింది.

భార్య మరణాన్ని శ్రావణ్‌కుమార్‌ తట్టుకోలేకపోయాడు. తీవ్ర మనస్థాపానికి గురైయ్యాడు. ఆదివారం సాయంత్రం చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్థు చేస్తున్నారు. తల్లిదండ్రులు ఇద్దరు రోజుల వ్యవధిలోనే మరణించడంతో 8 రోజుల పసికందు అనాథగా మారింది.

Next Story