అంతర్వేదిలో తీవ్ర‌ ఉద్రిక్తత

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  8 Sep 2020 9:26 AM GMT
అంతర్వేదిలో తీవ్ర‌ ఉద్రిక్తత

ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా అంతర్వేదిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి ర్యాలీగా వెళ్తున్న ధార్మిక సంఘాల నేతలు, భక్తులను పోలీసులు అడ్డుకున్నారు. ర్యాలీకి ఎలాంటి అనుమతులు లేవని వెంటనే వెనక్కి తిరిగి వెళ్లిపోవాలని ధార్మిక సంఘాల నేతలకు, భక్తులకు పోలీసులు సూచించారు.

అయితే.. శాంతియుతంగా ఆలయానికి వెళ్తుంటే త‌మ‌ను ఎందుకు అడ్డుకుంటున్నారని ధార్మిక సంఘాల నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. జైశ్రీరాం‌ నినాదాలతో వందలాది మంది ఒక్కసారిగా రావడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు వారిని అడ్డుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

ఇదిలావుంటే.. రెండు రోజుల క్రితం అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి రథం అగ్నిప్రమాదంలో కాలిపోవడం క‌ల‌క‌లం రేపింది. అయితే.. ఉద్దేశపూర్వకంగానే ఎవరో ఈ పని చేశారని హిందుత్వ సంఘాలు ఆరోపిస్తున్నాయి. అటు ప్రభుత్వం కూడా ఈ ఘటనను సీరియస్‌గా తీసుకుంది. ఇది ప్రమాదమా లేక ఏదైనా కుట్రకోణం ఉందా అని తేల్చేందుకు ఓ కమిటీని కూడా వేసింది.

ఇక.. ఈ విషయమై ప్ర‌భుత్వం ఆలయ ఈవో నల్లాని చక్రధరరావును విధుల నుండి తప్పించింది. ఆయన స్థానంలో ఎర్రంశెట్టి భద్రాజీరావుని కార్యనిర్వహణాధికారిగా నియమిస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఈరోజు ఆయన ఈఓ గా బాధ్యతలు స్వీకరించినట్లు తెలుస్తోంది. ఇదిలావుంటే.. ప్రమాదం జరిగిన స్థలాన్ని నేడు మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్‌, చెల్లుబోయిన వేణు పరిశీలించనున్నట్లు స‌మాచారం. ఈ నేఫ‌థ్యంలో ధార్మిక సంఘాల నేతలు ర్యాలీగా తరలిరావడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Next Story