ఎట్టకేలకు వారికి 4జీ సర్వీసులు..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  11 Aug 2020 7:44 AM GMT
ఎట్టకేలకు వారికి 4జీ సర్వీసులు..!

న్యూ ఢిల్లీ: మరికొద్ది రోజుల్లో 5జీ అందుబాటులోకి తెస్తామని టెలికాం కంపెనీలు చెబుతూ ఉన్నాయి. ఇంకా 4జీ సర్వీసు అందుబాటులో ఎవరికి రాలేదు అని అనుకుంటూ ఉన్నారా..? జమ్మూ కాశ్మీర్ లోని చాలా ప్రాంతాల్లో ఇంకా 2జీ సేవలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. జమ్మూ లోని జిల్లా లోనూ, కాశ్మీర్ వ్యాలీ లోనూ ఆగష్టు 15 తర్వాత 4జీ సేవలను అందుబాటులోకి రానున్నాయి.

అంతర్జాతీయ బోర్డర్ అయిన నియంత్రణ రేఖ ఉన్న ప్రాంతాల్లో ఈ సర్వీసులు అందుబాటులో ఉండవని కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలిపింది. ఏ ప్రాంతాల్లో అయితే తీవ్రవాదుల కార్యకలాపాలు అతి తక్కువగా ఉంటాయో అక్కడ మాత్రమే ఈ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. పరిస్థితులను బట్టి రెండు నెలల తర్వాత కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయంపై రివ్యూ చేయనుంది.

జమ్మూ కాశ్మీర్ లో హైస్పీడ్ ఇంటర్నెట్ ను భారత్ ప్రభుత్వం రద్దు చేసి సంవత్సరం పైనే అయింది. ఆర్టికల్ 370ని భారత ప్రభుత్వం రద్దు చేసినప్పటి నుండి హై స్పీడ్ ఇంటర్నెట్ సేవలు రద్దయ్యాయి.

ఇక అండమాన్ లో కూడా హై స్పీడ్ ఇంటర్నెట్

చెన్నై నుంచి అండమాన్ కు సముద్రం అడుగున ఏర్పాటు చేసిన అండర్ సీ ఆప్టికల్ ఫైబర్ ప్రాజెక్టును ప్రధాని మోదీ సోమవారం వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. దీంతో ఇకపై అండమాన్ లో హై స్పీడ్ ఇంటర్నెట్ అందుబాటు లోకి రానుంది. అండమాన్ నికోబార్ ఐల్యాండ్స్ లో తరచూ ఫోన్ కాల్స్ డ్రాప్ అయ్యేవని.. ఇంటర్నెట్ కనెక్టివిటీ సమస్యగా ఉండేదట.. ఇకపై అండమాన్ దీవుల్లో లో ఇలాంటి సమస్యలు ఉండవని మోదీ తెలిపారు.

ఫైబర్ ఆప్టిక్ తో అండమాన్ ను దేశంతో లింక్ చేయడం ద్వారా ఈజ్ ఆఫ్ లివింగ్ దిశగా కేంద్ర ప్రభుత్వం తన కమిట్ మెంట్ ను చాటుకుందన్నారు. టూరిస్టులకు హైస్పీడ్ ఇంటర్నెట్ అందుతుందని.. వేలాది కుటుంబాలకు ఎడ్యుకేషన్, బ్యాంకింగ్, షాపింగ్, టెలీ మెడిసిన్ వంటి సౌకర్యాలు అందుతాయన్నారు మోదీ.

చెన్నై, అండమాన్ అండర్ సీ ఆప్టికల్ కేబుల్ పొడవు: 2,313 కి.మి. అండర్ సీ కేబుల్ పనులను బీఎస్ఎన్ఎల్ సంస్థ రికార్డ్ స్థాయిలో 24 నెలల్లోపే పూర్తి చేసింది. పోర్ట్ బ్లెయిర్ కు సెకనుకు 400 గిగాబిట్ల స్పీడ్ తో, ఇతర ద్వీపాలకు 200 గిగాబైట్ల స్పీడ్ తో ఇంటర్నెట్ సేవలు ప్రారంభమయ్యాయి.

Next Story