టాలీవుడ్ హీరోయిన్ ఇంటిపై జీఎస్టీ సోదాలు
By న్యూస్మీటర్ తెలుగు Published on 20 Dec 2019 12:50 PM GMTహైదరాబాద్: టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఇంటిపై శుక్రవారం జీఎస్టీ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరల్ ఆధ్వర్యంలో హైదరాబాద్ జీఎస్టీ కమిషనరేట్ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాలలో ఆమె రూ. 20 లక్షలకు పైగా పన్ను చల్లించనట్లుగా అధికారులు గుర్తించారు. రెండు రోజుల క్రితం మంచు విష్ణుకు సంబందించిన స్కూళ్లల్లో సోదాలు నిర్వహించిన అధికారులు నేడు లావణ్య త్రిపాఠి ఇంట్లో సోదాలు నిర్వహించారు.
జీఎస్టీ అధికారులు మూడో రోజు వరుసగా హైదరాబాద్లోని 23 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నట్లు న్యూస్మీటర్కు తెలిపారు. ఎంటర్టైన్మెంట్, మీడియా హౌస్లు, ఫైనాన్షియల్ సర్వీసెస్, కన్సల్టెన్సీ, ఇన్ఫ్రా కంపెనీలు, ఫిట్నెస్ సెంటర్లతో సహా వివిధ రంగాలకు చెందిన సంస్థలలో సోదాలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.
లావణ్య త్రిపాఠి తాజాగా నిఖిల్ హీరోగా నటించిన 'అర్జున్ సురవరం' లో హీరోయిన్గా నటించింది. మోడలింగ్ నుండి సినిమాల్లోకి ప్రవేశించిన లావణ్య.. తెలుగుతో పాటు తమిళ చిత్రాల్లో కూడా నటించింది. చిన్నప్పటి భరతనాట్యంలో శిక్షణ పొందిన లావణ్య.. 2012 లో విడుదల అయిన అందాల రాక్షసి ద్వారా తెలుగు చిత్రసీమకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత సోగ్గాడే చిన్నినాయన, రాధ, దూసుకెళ్తా, భలే భలే మగాడివోయ్, మిస్టర్, ఉన్నది ఒకటే జిందగీ, శ్రీరస్తు శుభమస్తు వంటి పలు విజయవంతమైన సినిమాల్లో నటించింది.