ఆ ఆనందం ఎంతో సేపు లేదు.. వరుడు ఐసోలేషన్లో, వధువు క్వారంటైన్లో
By తోట వంశీ కుమార్ Published on 13 Jun 2020 9:42 AM ISTఆ ఇద్దరు ఎంతో సంతోషంతో పెళ్లి చేసుకున్నారు. కొత్త జీవితం ప్రారంభించాలని అనుకున్నారు. అయితే.. పెళ్లైన రెండో రోజే వరుడిని ఐసోలేషన్ కు కేంద్రానికి తరలించిన అధికారులు వధువుతో సహా పెళ్లికి హాజరైన వారందరిని క్వారంటైన్ చేశారు. ఇందుకు కారణం కరోనా పరీక్షా ఫలితాలు రాకముందే పెళ్లిచేసుకోవడమే. ఈ ఘటన కర్నూలు జిల్లా పత్తికొండ మండలంలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. కర్నూలు జిల్లా పత్తికొండ మండలం మర్రిమానుతండాకు చెందిన ఓ యువకుడు హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తున్నాడు. కరోనా టెస్టులకు నమూనాలు ఇచ్చాడు. వాటి రిపోర్టులు రాకముందే.. వెల్లుర్తి మండలం ఎల్.తండాకు చెందిన యువతిని ఈ నెల 10న వివాహాం చేసుకున్నాడు. ఆ రోజు రాత్రి ఏర్పాటు చేసిన విందులో వరుడు అస్వస్థతకు గురయ్యాడు. ఇదే సమయంలో వరుడికి కరోనా పాజిటివ్ గా ఫలితం వచ్చింది.
వెంటనే అప్రమత్తమైన అధికారులు వరుడిని ఐసోలేషన్కు తరలించారు. అప్పటికే వరుడు అందరితో కలిసి భోజనం చేసినట్లు గుర్తించారు. దీంతో వధువుతో సహా పెళ్లి వేడుకలో పాల్గొన్న అందరిని క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు. మొత్తం 70 కుటుంబాల నుంచి నమూనాలు సేకరించడంతో పాటు గ్రామాన్ని కంటెయిన్మెంట్ జోన్గా గుర్తించారు.