80 ఏళ్ల వయసులో పాట పాడిన ఎల్ఆర్ ఈశ్వరి.. రెహ్మాన్ ఫిదా.!
By న్యూస్మీటర్ తెలుగు Published on 4 Nov 2020 12:37 PM GMT![80 ఏళ్ల వయసులో పాట పాడిన ఎల్ఆర్ ఈశ్వరి.. రెహ్మాన్ ఫిదా.! 80 ఏళ్ల వయసులో పాట పాడిన ఎల్ఆర్ ఈశ్వరి.. రెహ్మాన్ ఫిదా.!](https://telugu.newsmeter.in/wp-content/uploads/2020/11/first-single-track-Aadi-Kuththu-by-LR-Eswari.jpg)
ఎల్ ఆర్ ఈశ్వరి.. సంగీత ప్రియులకు పరిచయం అవసరం లేని పేరు. ఎన్నో విజయవంతమైన గీతాలను పాడి అభిమానుల మనసులో చెరగని ముద్రవేసుకున్న లెజండరీ సింగర్. 'లే లే లే నా రాజా', 'మాయదారి చిన్నోడు', 'మసక మసక చీకటిలో', 'భలే భలే మగాడివోయ్' వంటి మాస్ సాంగ్స్తో తెలుగు ప్రేక్షకులను ఓ ఊపు ఊపిన గాయని.
ఆమె తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో కొన్ని వందల పాటలు పాడారు. కొన్ని సంవత్సరాలుగా గాయనిగా విరామం తీసుకున్న ఈశ్వరి తాజాగా నయనతార సినిమా 'మూకుట్టి అమ్మన్' కోసం గొంతు సవరించుకున్నారు. ఈ సినిమా తెలుగులో 'అమ్మోరు తల్లి' పేరుతో విడుదలవుతోంది.
రెండు భాషల్లోనూ టైటిల్ సాంగ్ను ఎల్ ఆర్ ఈశ్వరే పాడారు. 80 ఏళ్ల వయసులో ఆమె పాడిన తీరుకు సంగీత దిగ్గజం ఏఆర్ రెహ్మాన్ ఫిదా అయ్యారు. ఆమె మళ్లీ పాడడం చాలా సంతోషంగా ఉందని పేర్కొంటూ, ఆమె పాట పాడిన వీడియోను ట్విటర్ ద్వారా పంచుకున్నారు. ఈ సినిమా ఈనెల 14న డిస్నీ+ హాట్స్టార్లో విడుదల కాబోతోంది.