Fact Check : మోదీ ప్యూన్లతో కలిసి మెట్ల మీద కూర్చొని ముచ్చట్లు పెట్టారా..?
Modi sitting with some people are BJP Gujarat members. కొందరు యువకులతో కలిసి భారత ప్రధాని నరేంద్ర మోదీ మెట్ల మీద
By Medi Samrat Published on 30 Dec 2020 4:37 AM GMT
కొందరు యువకులతో కలిసి భారత ప్రధాని నరేంద్ర మోదీ మెట్ల మీద కూర్చున్న ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. నరేంద్ర మోదీ అలా కూర్చుంది ఆఫీస్ స్టాఫ్ తో అని.. వారంతా అక్కడ పని చేసే ప్యూన్లు అంటూ పోస్టులు పెట్టారు.
'భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆఫీసు స్టాఫ్ తో కలిసి మెట్ల మీద కూర్చున్నారు. అందులో నలుగురు ప్యూన్లు. ఆయన ప్రపంచం మెచ్చిన నేత అయినప్పటికీ కర్మ యోగిలా బ్రతుకుతూ ఉంటారు. చిన్నా పెద్దా అనే తారతమ్యాలు లేని వ్యక్తి అతను. ఆయన ఈ ఫోటో ద్వారా సమాజానికి ఇచ్చే మెసేజీ ఏమిటంటే అందరూ కలిసి కూర్చోవాలి.. కలిసి పని చేయాలి..! జై హింద్!' అని పోస్టుల్లో పెట్టారు.
నిజ నిర్ధారణ:
వైరల్ అవుతున్న ఈ పోస్టును న్యూస్ మీటర్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. ఈ ఫోటో ఇప్పటిది కాదని స్పష్టంగా తెలుస్తోంది. 2014 ఫిబ్రవరి నెలకు సంబంధించిన పోస్టు ఇది. అప్పటికి నరేంద్ర మోదీ ప్రధానమంత్రి కూడా అవ్వలేదు.
రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఇదే ఫోటోను బీజేపీ విభాగం 2014 ఫిబ్రవరిలో పోస్టు చేసింది. "Real Leader Shri Narendra Modi Seat on Steps with BJP Gujarat office staff And Made Them Smile." అంటూ ఆ ఫోటోకు క్యాప్షన్ పెట్టారు. నిజమైన నేత శ్రీ నరేంద్ర మోదీ స్టెప్స్ మీద కూర్చొని ఉన్నారు. ఇది గుజరాత్ బీజేపీ కార్యాలయంలో చోటు చేసుకుంది. ఆయన ఇలా చేయడం వలన అందరిలో నవ్వులు విరిశాయి అని చెప్పారు.
ఇదే ఫోటోను ఫిబ్రవరి 10, 2014న వెరిఫై చేసిన ట్విట్టర్ అకౌంట్ అయిన మజుర(సూరత్) ఎమ్మెల్యే, హర్ష్ సంఘవి కూడా ఇదే పోస్టును షేర్ చేశారు.
నరేంద్ర మోదీ అప్పటికి ప్రధానమంత్రి అవ్వలేదు. ప్రధానమంత్రిగా మోదీ బాధ్యతలు చేపట్టింది మే 2014లో.. ఈ వైరల్ ఫోటో మోదీ ప్రధానమంత్రి కాకముందు తీసినది.
ఈ పోస్టులను బట్టి తెలిసింది ఏమిటంటే.. వైరల్ పోస్టులో ఉన్న ఫోటోను మోదీ ప్రధానమంత్రి అవ్వకముందే తీశారు. ఈ ఫోటోలో ఉన్న వాళ్లు ప్రధానమంత్రి కార్యాలయంలో పని చేసే వారు కాదు. గాంధీ నగర్ లోని బీజేపీ గుజరాత్ ఆఫీసులో పని చేసే వారిది.
Claim Review:మోదీ ప్యూన్లతో కలిసి మెట్ల మీద కూర్చొని ముచ్చట్లు పెట్టారా..?