FactCheck : బర్డ్ ఫ్లూ మనుషులకు వ్యాపిస్తుందా.? చాలా అరుదని అంటున్న వైద్యులు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
ఏవియన్ ఇన్ఫ్లుఎంజా నే 'బర్డ్ ఫ్లూ' అని కూడా పిలుస్తారు. ఇది ఇన్ఫ్లుఎంజా రకం A వైరస్ వల్ల కలిగే ఇన్ఫెక్షన్, ఇది ప్రధానంగా పక్షులను ప్రభావితం చేస్తుంది.
By న్యూస్మీటర్ తెలుగు Published on 16 Feb 2025 7:11 PM IST
ఏవియన్ ఇన్ఫ్లుఎంజా నే 'బర్డ్ ఫ్లూ' అని కూడా పిలుస్తారు. ఇది ఇన్ఫ్లుఎంజా రకం A వైరస్ వల్ల కలిగే ఇన్ఫెక్షన్, ఇది ప్రధానంగా పక్షులను ప్రభావితం చేస్తుంది. మహారాష్ట్ర, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, తెలంగాణలో బర్డ్ ఫ్లూ వ్యాప్తి ఉంది. అయితే ఈ వైరస్ మానవులపై ప్రభావం చూపుతుందని, ఆన్లైన్లో అనేక అస్పష్టమైన వాదనలు ప్రచారం అవుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో ఏవియన్ ఫ్లూ కేసులు నమోదవుతున్న నేపధ్యంలో తెలంగాణ ప్రభుత్వం చికెన్ తినే విషయంలో ప్రజలను హెచ్చరించిందని సోషల్ మీడియా పోస్ట్ లో పేర్కొన్నారు.
ఈ పోస్టుల కారణంగా ప్రజల్లో పలు అనుమానాలు మొదలయ్యాయి.. మనుషులకు కూడా బర్డ్ ఫ్లూ సోకుతుందా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి
నిజ నిర్ధారణ :
పక్షుల నుండి మానవునికి సంక్రమించే ఇన్ఫెక్షన్ కేసులు చాలా అరుదు.
ఏవియన్ ఇన్ఫ్లుఎంజా వైరస్ మానవులను ప్రభావితం చేస్తుందనే వాదన ప్రజలను తప్పుదారి పట్టిస్తోందని NewsMeter కనుగొంది.
బర్డ్ ఫ్లూ వైరస్ మానవులకు వ్యాపించిన సంఘటనలు ఉన్నప్పటికీ, కేసులు చాలా అరుదు. వైరస్ పరివర్తన చెందినప్పుడు మాత్రమే మనుషుల్లో కూడా ఈ వైరస్ వ్యాప్తి సంభవిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
జూబ్లీహిల్స్లోని అపోలో హాస్పిటల్స్కు చెందిన ఇంటర్నల్ మెడిసిన్ కన్సల్టెంట్ డాక్టర్ జె అనీష్ ఆనంద్ మాట్లాడుతూ, "ఈ వైరస్ ప్రధానంగా లాలాజలం, నాసికా స్రావాలు, వైరస్ సోకిన పక్షుల మలంతో పాటు కలుషితమైన ఉపరితలాలు, ఫీడ్ లేదా వాటర్తో సంపర్కం ద్వారా పక్షుల మధ్య వ్యాపిస్తుంది." అని తెలిపారు.
"అరుదైన సందర్భాల్లో, ఏవియన్ ఇన్ఫ్లుఎంజా మానవులకు వ్యాప్తి చెందుతూ ఉంటుంది. వ్యాప్తి చాలా అరుదుగా ఉన్నప్పటికీ, ఒకరి నుండి మరొకరికి సంక్రమించే కేసులు కూడా నమోదయ్యాయి, సాధారణంగా చాలా సన్నిహితంగా ఉన్న వ్యక్తుల మధ్య మాత్రమే వ్యాప్తి ఉంటుంది" డాక్టర్ అనిష్ ఆనంద్ చెప్పారు. మొదట పక్షుల నుండి మనిషికి, ఆ తర్వాత మానవుని నుండి మానవునికి వ్యాప్తి చెందుతాయి
వ్యాధి సోకిన పక్షులు లేదా వాటి లాలాజలం లేదా మలం ద్వారా కలుషితమైన ఉపరితలాలతో ప్రత్యక్ష సంబంధం ద్వారా పక్షుల నుండి మానవులకు సంక్రమణ జరుగుతుంది.
ఈ వైరస్ ముఖ్యంగా కోళ్లు, టర్కీలు, బాతులతో సహా దేశీయ పక్షులతో సన్నిహిత సంబంధంలో ఉన్న మానవులను ప్రభావితం చేయవచ్చు. సాధారణంగా, బాతులు, పెద్దబాతులు వంటి రిజర్వాయర్ పక్షులు ఇన్ఫ్లుఎంజా వైరస్లను మోసుకువస్తూ ఉంటాయి. ఆ తర్వాత దేశీయ కోళ్ళకు కూడా వైరస్ వ్యాప్తి చెందుతుంది. ఇన్ఫ్లుఎంజా పౌల్ట్రీ ఫారమ్లలో తీవ్రమైన ప్రభావం చూపుతుంది. దీని ఫలితంగా పెద్ద ఎత్తున పక్షులు చనిపోతాయి. ఆరోగ్య అధికారులు వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి పెద్ద సంఖ్యలో పక్షులను చంపేస్తూ ఉంటారు.
తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు:
తెలంగాణ ప్రభుత్వ వెటర్నరీ, పశుసంవర్ధక అదనపు డైరెక్టర్ డాక్టర్ సి.మల్లీశ్వరి మాట్లాడుతూ, “వైరస్ మానవులను ప్రభావితం చేయదు. సరిగ్గా వండిన కోడి, గుడ్లు తినడానికి సురక్షితమే. వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వం నిఘాతో సహా కఠినమైన చర్యలను అమలు చేస్తోంది." అని తెలిపారు.
గాంధీ ఆసుపత్రి సీనియర్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రాజారావు మాట్లాడుతూ, ఈ వైరస్ మనుషులకు వ్యాపించే అవకాశం తక్కువ. వైరస్ పరివర్తన చెందినప్పుడు లేదా హ్యూమన్ ఇన్ఫ్లుఎంజా వైరస్లతో మార్పిడి కారణంగా వ్యాప్తి చెందుతుంది.
బర్డ్ ఫ్లూ లక్షణాలు, చికిత్స:
దేశీయ పౌల్ట్రీలో పెద్ద ఎత్తున బర్డ్ ఫ్లూ కారణంగా మరణాలు సంభవిస్తూ ఉంటాయి. ఆకలి లేకపోవడం, తల, మెడ వాపు, శ్వాసకోశ సమస్యలు, గుడ్డు ఉత్పత్తి తగ్గడం వంటి లక్షణాలు కోళ్లలో ఉన్నాయి. అత్యంత వ్యాధికారక ఏవియన్ ఇన్ఫ్లుఎంజా (HPAI) జాతులు పౌల్ట్రీ మందలలో తీవ్రమైన, తరచుగా ప్రాణాంతక వ్యాప్తికి కారణమవుతాయి.
మనుషులకు బర్డ్ ఫ్లూ సోకినప్పుడు ఎలాంటి లక్షణాలు ఉంటాయో డాక్టర్ అనీష్ వివరించారు.
"మానవులలో ప్రారంభ లక్షణాలు జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, కండరాల నొప్పులు-కాలానుగుణ ఫ్లూ లాగా ఉంటాయి. తీవ్రమైన వ్యక్తీకరణలు న్యుమోనియా, తీవ్రమైన శ్వాసకోశ బాధ, బహుళ అవయవ వైఫల్యం మరియు కొన్ని సందర్భాల్లో మరణానికి దారితీస్తాయి" అని డాక్టర్ అనిష్ ఆనంద్ చెప్పారు.
వ్యాధి సోకిన పక్షులతో పనిచేసే లేదా సమీపంలో నివసించే వ్యక్తులు (పౌల్ట్రీ కార్మికులు, పశువైద్యులు) ప్రమాదం అంచున ఉంటారు. ప్రత్యేకించి రక్షణ చర్యలు తీసుకోకపోతే ఇబ్బందులు తప్పవు.
వైరస్ సోకిన పక్షులతో దూరంగా ఉండాలి.. ఆహారాన్ని పూర్తిగా ఉడికించాలి:
రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభావిత ప్రాంతాల్లో కఠినమైన పరీక్షలు, వైరస్ సోకిన ప్రాంతాలలో నిఘా కూడా పెంచారు. పౌల్ట్రీ రవాణాపై నిషేధంతో సహా నివారణ చర్యలను ప్రారంభించారు.
“క్రిమిసంహారక మందులు వాడడం, మనుషుల ప్రవేశాన్ని పరిమితం చేయడం, పక్షులను తాకే సమయాల్లో రక్షణ పరికరాలు (PPE) ధరించడం వంటి కఠినమైన చర్యలను అమలు చేయడం పౌల్ట్రీ కార్మికులకు అవసరం. జబ్బుపడిన లేదా చనిపోయినట్లు కనిపించే పక్షులతో ప్రజలు దూరంగా ఉండాలి. పౌల్ట్రీ పదార్థాలను, గుడ్లను పూర్తిగా ఉడికించాలి. అధిక ఉష్ణోగ్రతలు ఏవియన్ ఇన్ఫ్లుఎంజా వైరస్లను చంపేస్తాయి” అని డాక్టర్ అనిష్ ఆనంద్ తెలిపారు.
Credits : Neelambaran A