సీఎం చంద్రబాబుతో సినీ పెద్దల మీటింగ్కు ముహూర్తం ఫిక్స్
టాలీవుడ్ సినీ ప్రముఖులు, కూటమి ప్రభుత్వానికి మధ్య నెలకొన్న వివాదానికి ఎండ్ కార్డ్ పడబోతోంది.
By Knakam Karthik
సీఎం చంద్రబాబుతో సినీ పెద్దల మీటింగ్కు ముహూర్తం ఫిక్స్
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టాలీవుడ్ సినీ ప్రముఖులు, కూటమి ప్రభుత్వానికి మధ్య నెలకొన్న వివాదానికి ఎండ్ కార్డ్ పడబోతోంది. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయింది. ఇప్పటి వరకు పరిశ్రమ పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబును కలవక పోవటంపైన తాజాగా పవన్ సీరియస్ అయ్యారు. రిటర్న్ గిఫ్ట్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆ తరువాత సినీ పెద్దలు స్పందించారు. పవన్ వ్యాఖ్యలకు అల్లు, దిల్ రాజు మద్దతు ప్రకటించారు. ఇక, ఇప్పుడు టాలీవుడ్ పెద్దలు సీఎం చంద్రబాబును కలిసేందుకు నిర్ణయించారు. పవన్ సారధ్యంలోనే కలవాలని డిసైడ్ అయ్యారు. ఈ నెల 15న సీఎం చంద్రబాబును ఉండవల్లి నివాసంలో సాయంత్రం 4 గంటలకు సినీ పెద్దలు కలవనున్నారు. ఈ భేటీలో సీని పరిశ్రమలో ఉత్పన్నమైన సమస్యలు, సంక్షేమంపైనే ప్రధానంగా చర్చించబోతున్నట్లుగా తెలుస్తోంది.
ఈ క్రమంలోనే చలనచిత్ర పరిశ్రమ పెద్దల వైఖరిపై పవన్ కల్యాణ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్నా.. సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసేందుకు సినీ ప్రముఖులు ముందుకు రాకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం సినీ రంగాన్ని, అగ్ర నటులను ఎలా ఇబ్బందులకు గురి చేసిందో అప్పుడే మరిచిపోయారా అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం వ్యక్తులను కాకుండా, పరిశ్రమ అభివృద్ధిని మాత్రమే దృష్టిలో ఉంచుకుంటుందని స్పష్టం చేశారు. సినీ పరిశ్రమ నుంచి అందిన ఈ ‘రిటర్న్ గిఫ్ట్’ను తగిన రీతిలోనే స్వీకరిస్తానని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే కీలక పరిణామం చోటుచేసుకుంది.