Pruthvi Complaints Against Jeevitha. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో జీవితపై చర్యలు తీసుకోవాలంటూ నటుడు
By Medi Samrat Published on 23 Sep 2021 12:22 PM GMT
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో జీవితపై చర్యలు తీసుకోవాలంటూ నటుడు పృథ్వీరాజ్ ఎన్నికల అధికారికి లేఖ రాయడంతో వివాదం మొదలైంది. మా సభ్యులను జీవిత మభ్యపెడుతున్నారంటూ పృథ్వీ తన లేఖలో ఆరోపించారు. తనకు ఓట్లేస్తేనే ప్రయోజనాలు ఉంటాయని జీవిత చెబుతోందని.. జీవిత నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ వెల్లడించారు. ఆమెపై క్రమశిక్షణ కమిటీ ద్వారా చర్యలు తీసుకోవాలని కోరారు. జీవిత మా ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నుంచి ప్రధాన కార్యదర్శి పదవి కోసం పోటీ చేస్తుండగా, మంచు విష్ణు ప్యానెల్లో ఉన్న పృథ్వీరాజ్ మా ఉపాధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నారు.
అక్టోబరు 10న మా ఎన్నికల పోలింగ్ జరగనుండగా, మంచు విష్ణు ఇవాళ తన ప్యానెల్ ను ప్రకటించడం తెలిసిందే. జీవిత కారణంగా బండ్ల గణేష్ కూడా ప్రకాష్ రాజ్ ప్యానల్ నుండి బయటకు వచ్చారు. ఇప్పుడు పృథ్వీ కూడా ఫిర్యాదు చేయడం సంచలనమైంది. మా ఎన్నికల్లో పోటీ చేసేందుకు తన కార్యవర్గాన్ని మంచు విష్ణు ప్రకటించారు. విష్ణు ప్యానెల్లో జనరల్ సెక్రెటరీగా రఘుబాబు, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా బాబూమోహన్, వైస్ ప్రెసిడెంట్లుగా మాదాల రవి, పృథ్వీరాజ్ ఉన్నారు. అక్టోబరు 10న మా ఎన్నికలు జరగనున్నాయి.