తమిళ సినీ ప్రేమికులు, మీడియా జన నాయగన్, పరాశక్తి మధ్య పొంగల్ బాక్సాఫీస్ పోటీని చూడాలని ఎదురుచూశారు. అయితే, సెన్సార్ సమస్యల కారణంగా విజయ్ చిత్రం విడుదల కాలేదు. సుధా కొంగర దర్శకత్వం వహించిన పరాశక్తి థియేటర్లలోకి వచ్చింది. జన నాయగన్ మొదట జనవరి 9న విడుదల కావాల్సి ఉంది. జనవరి 14న మొదట ప్రకటించిన పరాశక్తి, తరువాత జనవరి 10కి మార్చారు. ఈ మార్పు సోషల్ మీడియాలో తీవ్ర చర్చలకు, ఫ్యాన్ వార్స్ కు దారితీసింది. రెండు చిత్రాలు సెన్సార్ సంబంధిత సమస్యలను ఎదుర్కొన్నాయి. శివకార్తికేయన్- సుధా కొంగర కాంబినేషన్ లో తెరకెక్కిన పరాశక్తి సమస్యలను పరిష్కరించి విడుదల చేయగా, విజయ్ చిత్రం జన నాయగన్ ఇప్పటికీ కోర్టులో ఉంది.
అయితే పరాశక్తి సినిమాపై విజయ్ అభిమానులు దుష్ప్రచారం చేస్తున్నారని చిత్ర దర్శకురాలు సుధా కొంగర ఆరోపించారు. ఈ మార్కెటింగ్ యుగంలో ఎన్నో సవాళ్లను దాటుకోవాల్సి వస్తుందన్నారు. సినిమా బాగున్నా సరే తప్పుడు ప్రచారంలో ఇబ్బందులు తప్పవన్నారు. ఒక నటుడి అభిమానుల వల్ల మేము చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చిందని అన్నారు. ఫేక్ ఐడీలతో మాపై చాలా దారుణమైన పోస్టులు చేస్తున్నారని, ఇదంతా ఎవరు చేస్తున్నారో అందరికీ తెలుసన్నారు. విజయ్ ఫ్యాన్స్ పేరుతో కొన్ని ఖాతాల నుంచి షేర్ చేసిన పోస్టులు మరింత నీచంగా ఉన్నాయి. తమ హీరో సినిమా విడుదల కాలేదని ఆయన ఫ్యాన్స్ చేసే హెచ్చరికలు ఆందోళనకు గురిచేసేలా ఉన్నాయని ఆమె అన్నారు.