ఆ సినిమా సెన్సార్ చిక్కుల్లో పడిందా.?

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. రాజకీయ నేపథ్య సినిమాలు విడుదల అవుతూ ఉన్నా.. వాటిని జనం పెద్దగా పట్టించుకోలేదు

By Medi Samrat  Published on  24 April 2024 7:30 AM GMT
ఆ సినిమా సెన్సార్ చిక్కుల్లో పడిందా.?

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. రాజకీయ నేపథ్య సినిమాలు విడుదల అవుతూ ఉన్నా.. వాటిని జనం పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పటికే ఆర్జీవీ రెండు సినిమాలు విడుదల చేశారు, యాత్ర 2 అని మరో సినిమా వచ్చింది, రాజధాని ఫైల్స్ అంటూ ఒక చిత్రం, వివేకా హత్య అంటూ మరొక చిత్రం వచ్చాయి. ఇప్పుడు నారా రోహిత్ నటించిన ప్రతినిధి 2 సినిమా వెండితెర మీద విడుదలకు సిద్ధమవుతోంది. 'ప్రతినిధి 2' టీజర్‌, పాటలు, ట్రైలర్‌ను ఇటీవలే విడుదల చేశారు. ఈ శుక్రవారం ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. చాలా కాలం క్రితమే సెన్సార్ స్క్రీనింగ్ కోసం టీమ్ దరఖాస్తు చేసుకుంది కానీ ఫార్మాలిటీస్ ఇంకా పూర్తి కాలేదని తెలుస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వ్యవస్థ, పాలనపై సెటైర్‌గా ఈ సినిమా తెరకెక్కింది. త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ సినిమా సెన్సార్ చిక్కుల్లో పడింది. ఈ చిత్రం ఇప్పుడు కొత్త విడుదల తేదీతో రానుంది.. ఈ సినిమా రిలీజ్ డేట్ త్వరలో ప్రకటించనున్నారు. నారా రోహిత్ నటించిన పొలిటికల్ థ్రిల్లర్ చిత్రం ప్రతినిధికి సీక్వెల్ ప్రతినిధి 2 సినిమా. ప్రముఖ జర్నలిస్టు మూర్తి దేవగుప్తపు దర్శకత్వంలో వానరా ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.

Next Story