కించపరిచేలా ట్రోల్స్ చేసే వారిపై కేసు పెడతాం : మంచు ఫ్యామిలీ హెచ్చరిక
Manchu family threaten to sue those who make derogatory trolls against their family. మోహన్ బాబు చిత్రం సన్ ఆఫ్ ఇండియా విడుదల నేపథ్యంలో గత కొన్ని రోజులుగా
By Medi Samrat Published on 19 Feb 2022 2:22 PM GMT
మోహన్ బాబు చిత్రం సన్ ఆఫ్ ఇండియా విడుదల నేపథ్యంలో గత కొన్ని రోజులుగా మంచు కుటుంబం గురించి సోషల్ మీడియాలో మీమ్స్, ట్రోల్స్తో పోస్టులు వైరల్ అవుతున్నాయి. భవిష్యత్తులో ఇటువంటి అవమానకరమైన కంటెంట్ను పోస్ట్ చేయకుండా ఉండటమే కాకుండా.. పోస్ట్ చేసిన వాటన్నింటినీ తొలగించాలని కోరుతూ.. మీమ్ పేజీలు, యూట్యూబ్ ఛానెల్లకు లేఖను జారీ చేసింది మోహన్ బాబు, మంచు విష్ణు పీఆర్ఓ బృందం. నిర్వాహకులు ఇచ్చిన గడువుకు కట్టుబడి ఉండకపోతే.. వారిపై పరువు నష్టం కింద కేసు నమోదు చేస్తామని.. ప్రతి ఒక్కరి నుండి రూ. 10 కోట్ల నష్టపరిహారం కోరుతామని లేఖలో హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్లో సినిమా టిక్కెట్ల సమస్య కారణంగా టాలీవుడ్లోని కొద్దిమంది తమ కుటుంబాన్ని అన్యాయంగా టార్గెట్ చేశారని.. ట్రోల్ చేస్తున్నారని లేఖలో ఆరోపించారు. సన్ ఆఫ్ ఇండియా కోసం అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమైనప్పటి నుండి సోషల్ మీడియాలోకి ట్రోల్స్ ప్రారంభమయ్యాయని.. మొదటి రోజు బుకింగ్లు బలహీనంగా ఉన్నాయని ఆరోపించారు. విష్ణు మంచు జగన్ ని కలిసిన తర్వాత ప్రెస్ ఇంటరాక్షన్ను ట్రోల్ చేస్తూ అనేక వీడియోలు చుట్టుముట్టాయని తెలిపారు.
మీమ్లు ఫన్నీగా ఉన్నప్పుడు మేము వాటిని ఆనందిస్తాము.. అవి అవమానకర ట్రోలింగ్కు మారినప్పుడు సమస్య. ఇండస్ట్రీలో ఇద్దరు పెద్ద హీరోలు మా ఫ్యామిలీని టార్గెట్ చేసేందుకు ఓ టీమ్ని పెట్టుకున్నారు. వాళ్లెవరో నాకు తెలుసు కానీ కాలమే సమాధానం చెబుతుందని మోహన్ బాబు ఇటీవల అన్నారు. మా ఎన్నికల సమయంలో కూడా మంచు విష్ణుపై అనేక ట్రోల్స్ వచ్చాయి.. కానీ అతను అధ్యక్ష ఎన్నికలలో గెలిచాడు.