సీనియర్ నటి రాశికి అనసూయ క్షమాపణలు
'దండోరా' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్లో నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.
By - Medi Samrat |
'దండోరా' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్లో నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. మహిళల వస్త్రధారణపై ఆయన చేసిన వ్యాఖ్యలపై అనసూయ తీవ్ర విమర్శలు గుప్పించారు. నటి రాశి ఓ వీడియో విడుదల చేశారు. ఓ టీవీ కార్యక్రమంలో తనపై యాంకర్ అనసూయ చేసిన 'రాశి గారి ఫలాలు' అనే డబుల్ మీనింగ్ డైలాగ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో రాశికి అనసూయ క్షమాపణలు చెప్పారు. "మూడు సంవత్సరాల క్రితం నేను చేసిన ఒక షోలో తెలుగు సరిగ్గా రానితనంపై చేసిన స్కిట్ లో మీ పేరును ఉపయోగించి నా నోటి నుంచి డబల్ మీనింగ్ డైలాగ్ చెప్పించడం జరిగింది. ఇది రాయించి డైరెక్ట్ చేసిన వ్యక్తుల్ని నేను ఆ రోజే నిలదీసి అడిగి ఉండాల్సింది కానీ అప్పటికి నాకు ఉన్నటువంటి శక్తి అందుకు సహకరించలేదు. అది పొరపాటే.. దయచేసి క్షమించండి. వెనక్కి వెళ్లి ఇప్పుడు నేను దాన్ని సరిదిద్దలేను. ఆ మాటలని ఖండించడం దగ్గర నుంచి ఆ షో విడిచి పెట్టడం వరకు నాలోని ఆ మార్పు మీరు గమనించవచ్చు. ఈరోజు మహిళలందరి భద్రత గురించి గట్టిగా మాట్లాడుతున్న నాకు వ్యతిరేకంగా అప్పటి ఆ మాటలు తీసి ఇప్పుడు నాకు వ్యతిరేకంగా నడిపిస్తున్నారు. నన్ను షేమ్ చేయడానికి చేస్తున్న ఈ కథనాలు మీకు ఎంత ఇబ్బందికరంగా ఉన్నాయో ఊహించగలను. ఆ కార్యక్రమం దర్శక, రచయిత, నిర్మాతలు మీకు క్షమాపణలు చెప్పినా చెప్పకపోయినా నా బాధ్యతగా నా తప్పుని అంగీకరిస్తూ మీకు క్షమాపణ చెప్తున్నాను" అంటూ ఓ పోస్టు పెట్టారు అనసూయ.