దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకలో ప్రముఖ కమెడియన్ అలీపై రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యల పట్ల నెటిజన్లు మండిపడుతున్నారు. తాజాగా నటుడు అలీ ఒక వీడియో ద్వారా స్పందించారు. ఎస్వీ కృష్ణారెడ్డి పుట్టినరోజు సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రాజేంద్ర ప్రసాద్ అనుకోకుండా అలాంటి మాటలు అన్నారన్నారు. ఉద్దేశపూర్వకంగా అనలేదని, పొరపాటున మాట తూలిందన్నారు. ఆయనొక మంచి నటుడు, కొద్దిరోజుల క్రితం తనకు అమ్మలాంటి కూతురు మరణం వల్ల పుట్టెడు దుఃఖంలో ఉన్నారు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి. ఆయన పెద్దాయన, కావాలని అనలేదని నటుడు అలీ వీడియోలో వివరించారు.
హైదరాబాద్లో జరిగిన ఎస్వీ కృష్ణా రెడ్డి జన్మదిన వేడుకలో పాల్గొన్న సమయంలో అలీపై రాజేంద్ర ప్రసాద్ నోరు పారేసుకున్నారు. ఈ కార్యక్రమం గురించి తనకు ఆలస్యంగా తెలిసిందని, ఎన్టీఆర్ అవార్డు తీసుకోవడానికి ఏపీకి వెళ్లానని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. అప్పుడూ ఎవరూ చప్పట్లు కొట్టకపోవడంతో ఏంటీ మీరు చప్పట్లు కొట్టరా ఎన్టీఆర్ అవార్డు తీసుకోవడానికి వెళ్తే చప్పట్లు కొట్టరా అని అందరినీ ఉద్దేశించి ప్రశ్నించారు. బ్రెయిన్ పోయిందా, చప్పట్లు కొట్టకుంటే వారికి సిగ్గులేనట్లే అని అనేసారు.