తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభ‌మైన ఇంటర్ పరీక్షలు

Intermediate exams starts Telugu states.తెలుగు రాష్ట్రాల్లో ఇంట‌ర్ ప‌రీక్ష‌లు ప్రారంభ‌మ‌య్యాయి. ఉద‌యం 9 గంటల

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 May 2022 6:00 AM GMT
తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభ‌మైన ఇంటర్ పరీక్షలు

తెలుగు రాష్ట్రాల్లో ఇంట‌ర్ ప‌రీక్ష‌లు ప్రారంభ‌మ‌య్యాయి. ఉద‌యం 9 గంటల నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు పరీక్ష‌లు జ‌ర‌గ‌నున్నాయి. విద్యార్థులు నిర్థేశిత స‌మ‌యానికి కంటే ముందుగానే ప‌రీక్షా కేంద్రానికి చేరుకున్నారు. క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి కార‌ణంగా గ‌త రెండు సంవ‌త్స‌రాలుగా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌లేదు. ఈ ఏడాది ప‌రీక్ష‌ల‌ను ప‌క‌డ్భందీగా నిర్వ‌హించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

తెలంగాణలో నేటి నుంచి మే 23 వరకు ప‌రీక్ష‌లు జ‌ర‌గ‌నుండగా.. ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రంలో ఈ రోజు నుంచి మే 24 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరగనున్నాయి. ఇక తెలంగాణలో ఇంటర్ పరీక్షలు రాసే విద్యార్థులు అంతా ఉదయం 8 గంటల 30 నిమిషాల లోపే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని, నిమిషం ఆలస్యమైనా అనుమతించరని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి తెలిపారు. మొత్తం 9,07,393 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాయనున్నారు. ఇందుకోసం 1,443 ఎగ్జామ్‌ సెంటర్లను ఏర్పాటు చేశారు.

ఏపీ వ్యాప్తంగా మొత్తం 10,01,058 మంది విద్యార్థులు పరీక్షలు రాయ‌నున్నారు. ఇందుకోసం 1,456 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాల్లోకి మొబైల్‌ ఫోన్లు అనుమతించరు. జిల్లాకు ఐదు చొప్పున ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, సిట్టింగ్ స్క్వాడ్‌లను ఏర్పాటు చేశారు. అలాగే, అన్ని పరీక్ష కేంద్రాల్లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల సందర్భంగా నెలకొన్న ఘటనలను దృష్టిలో పెట్టుకొని ఇంటర్‌ పరీక్షల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా అధికారులు జాగ్రత్తలు చేపట్టారు. పరీక్ష కేంద్రాల్లో అన్ని గదుల్లోనూ, బయట సీసీ కెమెరాలను అమర్చారు. ఈ కెమెరాల ద్వారా పరీక్షల తీరుతెన్నులను రికార్డు చేయడంతోపాటు వాటన్నింటినీ ఇంటర్‌ బోర్డు కార్యాలయానికి అనుసంధానించారు. ఆన్‌లైన్‌ స్ట్రీమింగ్‌ ద్వారా బోర్డు అధికారులు పరీక్షలు జరుగుతున్న తీరును నిత్యం పరిశీలిస్తారు. జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలోని ప్రత్యేక కమిటీలు ఇంటర్‌ పరీక్షలను పర్యవేక్షించనున్నాయి.

Next Story