ఇక సింగిల్‌ లైన్లు ఉండవు.. అన్ని డబుల్‌ లైన్లే.. కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌

By సుభాష్  Published on  11 Feb 2020 11:20 AM GMT
ఇక సింగిల్‌ లైన్లు ఉండవు.. అన్ని డబుల్‌ లైన్లే.. కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌

- రెండు లైన్ల నిర్మాణానికి రూ. 9వేల కోట్లు మంజూరుకు అనుమతి

దేశంలో ఆలస్యంగా నడిచేవి ఏవి అంటే ముందుగా గుర్తుకు వచ్చేది రైళ్లు. రైళ్ల వేగాన్ని పెంచాలన్నా ప్రతి మార్గంలో రెండు ట్రాక్‌లు అవసరం. కొత్తగా రెండు ప్రధాన మార్గాలను రెండు లైన్లుగా మార్చబోతుండటంతో, షిర్టీ మీదుగా ముంబాయి, తిరుపతి మీదుగా చెన్నై ఈ రెండు ప్రధాన మార్గాలకు ప్రత్యామ్నాయ రూట్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం ఉన్న ఒకే మార్గంపై పడుతున్న భారాన్ని తగ్గిస్తూ రెండు మార్గాల్లో రైళ్లను నడిపే వెసులుబాటు అందుబాటులోకి రానుంది. దీని వల్ల దూరం తగ్గడమే కాకుండా ఆ ప్రాంతాలకు వెళ్లే రైళ్ల సంఖ్యను పెంచేందుకు అవకాశం కలుగుతోంది. అలాగే తెలంగాణ వ్యాప్తంగా సింగిల్‌ లైన్లు ఉండవు. అన్ని డబుబల్ లైన్లుగానే ఉండనున్నాయి. ఈ సదుపాయం మరో మూడేళ్లలో అందుబాటులోకి రానుంది. ఇందుకు సంబంధించి ఈ ఏడాది దాదాపు రూ. 9వేల కోట్లతో పనులు ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం మీదుగా ముంబాయికి ప్రధాన మార్గం వికారాబాద్‌ - వాడీ లైను. రైళ్లన్నీ ఈ ప్రధాన మార్గం గుండానే వెళ్తున్నాయి. ముంబాయికి నిజామాబాద్‌ - బాసర మీదుగా సాగే ముద్ఖేడ్‌ లైను ఉన్నప్పటికీ ఇది సింగిల్‌ లైన్‌ కావడంతో ప్రధాన రైళ్లను నడిపే అవకాశం లేకుండా పోతోంది. షిర్టీకి కూడా ఇదే ప్రధాన మార్గం.

సింగిల్‌ లైన్‌ కారణంగా ఇబ్బందులు

ఇక సింగిల్‌ లైన్‌ ఉన్న కారణంగా అధికంగా రైళ్లను నడిపే అవకాశం లేకుండా పోతోంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం అకోలా - డోన్‌ మార్గాన్ని రెండు లైన్లుగా మార్చాలని నిర్ణయించింది. ఇందుకు 626 కిలోమీటర్ల మేర రెండో మార్గం నిర్మించేందుకు గానూ రూ. 6 వేల 260 కోట్లను మంజూరు చేసింది.

బాసర దాటే వరకు డబుల్‌ లైన్‌ నిర్మాణం..

ఈ రెండు లైన్ల నిర్మాణంలో భాగంగా తెలంగాణలో బొల్లారం నుంచి నిజామాబాద్‌ మీదుగా బాసర దాటే వరకు డబుల్‌ లైన్లు అందుబాటులోకి రానున్నాయి. దీంతో హైదరాబాద్‌ నుంచి ముంబాయికి రెండో ప్రధాన లైన్‌ అందుబాటులోకి వస్తుంది. దీంతో వాడీ మార్గంపై భారం తగ్గే అవకాశం ఉంది. షిర్టీకి కూడా రైళ్ల సంఖ్య తగ్గి డిమాండ్‌ అధికంగా ఉన్న ముంబాయికి అదనంగా ఎక్స్‌ ప్రెస్‌ రైళ్లు, సెమీ హైస్పీడ్‌రైళ్లను నడిపేందుకు అవకాశం ఉంది. అంతే కాదు డబ్లింగ్‌ ప్రాజెక్టులో మహబూబ్‌నగర్‌ నుంచి కర్నూలు వరకు కూడా రెండో ట్రాక్‌ అందుబాటులో ఉండటంతో ఆ మార్గంలో కూడా రైళ్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

ఇక రెండో ప్రత్యామ్నాయ మార్గం ఏర్పడే తిరుపతి, చెన్నై. ప్రస్తుతం హైదరాబాద్‌ నుంచి చెన్నై వెళ్లాలంటే వరంగల్‌ - విజయవాడ మీదుగా తిప్పుతున్నారు. ఇప్పుడు దీనికి ప్రత్యామ్నాయ మార్గం అందుబాటులోకి రానుంది. బీబీనగర్‌ - నల్లపాడు - నడికుడి - గుంటూరు మార్గాన్ని కూడా రెండు లైన్లుగా కేంద్రం మార్చబోతోంది. 248 కిలోమీటర్ల మేర ఉండే ఈ మార్గంలో డబ్లింగ్‌ కోసం రూ. 2వేల 480 కోట్లు మంజూరు చేసింది కేంద్ర సర్కార్‌.

సింగిల్‌ లైన్లతో ఇబ్బందులు

సింగిల్‌ లైన్‌ మీదుగా వెళ్లినప్పుడు రైళ్ల సంఖ్య తక్కువగా ఉంటోంది. ఒక ఎక్స్‌ ప్రెస్‌ రైలు వెళ్తుంటే దాని ముందు వచ్చే వచ్చే రైలును ఇతర స్టేషన్‌లలో నిలిపి దారి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఈ సమస్యల వల్ల రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో రైళ్ల ప్రయాణ సమయం కూడా పెరిగిపోతోంది. ఇలాంటి సమస్యలు ఉండటంతో రైళ్ల సంఖ్య పెరిగే అవకాశం ఉండదు. ప్రస్తుతం బొల్లారం నుంచి నిజామాబాద్‌ మీదుగా మహారాష్ట్ర వైపు, బీబీనగర్‌ నుంచి గుంటూరు మీదుగా తిరుపతి, చెన్నై వైపు ఇదే సమస్య ఉంది. ఇప్పుడు ఈ ప్రాజెక్టులు మంజూరు కావడంతో ఇలాంటి సమస్యలకు చెక్‌ పెట్టే అవకాశాలున్నాయి. మరి ఈ సౌకర్యం అందుబాటులోకి రావాలంటే మూడేళ్లు ఆగాల్సిందే.

Next Story