అన్నం పెట్టలేదని కన్న తల్లి పట్ల దారుణంగా ప్రవర్తించిన కొడుకు.. చివరికి?
Yadadri Bhuvanagiri District Crime News. తల్లి నవమాసాలు మోసి, కని, పెంచి పిల్లలను పెద్ద చేస్తుంది. ఆ పిల్లలు పెద్దగా
By - Medi Samrat |
తల్లి నవమాసాలు మోసి, కని, పెంచి పిల్లలను పెద్ద చేస్తుంది. ఆ పిల్లలు పెద్దగా అయ్యే వరకు వారి బాధ్యతలను, ఆలనాపాలనను తల్లి చూసుకుంటుంది. అయితే తల్లి వృద్ధాప్య దశకు చేరుకున్న తర్వాత కన్న తల్లికి తోడు, నీడగా నిలవాల్సిన ఆ కొడుకులు తల్లి పట్ల కాలయముడిగా మారుతున్నారు. తనకు జన్మనిచ్చిన తల్లి అని కూడా చూడకుండా ఎంతోమంది తల్లిదండ్రులను రోడ్డుకీడుస్తున్నారు. మరికొంతమంది తల్లిదండ్రులను హతమార్చిన సంఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం అలాంటి ఘటన ఒకటి భువనగిరి జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే...
యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం గొల్లగూడేనికి చెందిన బాతుక ధనమ్మకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. ప్రస్తుతం వీరికి పెళ్లిళ్లు చేసిన ధనమ్మ 20 సంవత్సరాల క్రితం తన భర్తను కోల్పోయింది. ఈ క్రమంలోనే తన కోడలు ఒక ప్రమాదంలో మరణించగా అప్పటినుంచి తన కొడుకు మల్లయ్య తల్లి దగ్గరే ఉంటున్నాడు. అయితే ఈనెల 20 న తాగి ఇంటికి వచ్చిన మల్లయ్యకి తన తల్లి అన్నం పెట్టలేదు. ఆ విధంగా వారిద్దరి మధ్య గొడవ జరగడంతో మద్యం మత్తులో ఉన్న మల్లయ్య ఒక్కసారిగా ధనమ్మ ఛాతిపై కొట్టడంతో స్పృహ తప్పి పడిపోయింది.
స్పృహ తప్పి పడిపోయిన ధనమ్మను స్థానికులు భువనగిరి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ధనమ్మ శుక్రవారం సాయంత్రం మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. తన తల్లి మరణానికి కారణం తన కొడుకేనని ధనమ్మ కుమార్తె ఇచ్చిన ఫిర్యాదు మేరకు మల్లయ్య పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ జానయ్య తెలియజేశారు.