వైద్యుల నిర్ల‌క్ష్యంతో బాలింత మృతి

వైద్యులు చేసే చిన్న చిన్న పొరపాట్లు రోగుల పాలిట మరణశాసనాలుగా మారుతూ ఉంటాయి.

By Medi Samrat  Published on  23 Aug 2023 10:36 AM GMT
వైద్యుల నిర్ల‌క్ష్యంతో బాలింత మృతి

వైద్యులు చేసే చిన్న చిన్న పొరపాట్లు రోగుల పాలిట మరణశాసనాలుగా మారుతూ ఉంటాయి. తాజాగా ఓ గర్భిణీ స్త్రీ ప్రభుత్వ ఆసుపత్రిలో బిడ్డకు జన్మనివ్వగా.. ఆ తర్వాత కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ పూర్తయ్యాక కడుపులో దూది మర్చిపోయి కుట్లు వేయడం ఆమె ప్రాణాలు పోవడానికి కారణమైంది.

నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట దర్శన్‌ గడ్డ తండాకు చెందిన రోజా అనే మహిళ.. ఆగస్టు 15న అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చింది. అదే రోజు రోజాకు వైద్యులు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ పూర్తయ్యాక కడుపులో దూది మర్చిపోయి కుట్లు వేశారు. దీంతో బాధితురాలు కడుపు నొప్పితో ఇబ్బంది పడుతూ వచ్చింది. ప్రసవం వల్ల కలిగిన నొప్పులని అంతా భావించారు. డిశ్చార్జి అయి ఇంటికి చేరుకున్నాక కూడా నొప్పి తగ్గకపోగా రోజా తీవ్ర అస్వస్థతకు గురైంది. 22వ తేదీన అచ్చంపేట ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అక్కడి వైద్యులు ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లాలని చెప్పారు. అక్కడి నుంచి ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లగా రోజా పరిస్థితి విషమంగా ఉందని హైదరాబాద్ కు తీసుకెళ్లాలని ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు సూచించారు. హైదరాబాద్ కు తీసుకొచ్చి ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి రోజా చనిపోయింది. కడుపులోని దూది వల్లే రోజా మరణించినట్లు వైద్యులు తెలిపారు. అనంతరం మృతదేహాన్ని అచ్చంపేటకు తరలించిన రోజా కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రి ముందు ఆమె మృతదేహంతో ఆందోళనకు దిగారు.

Next Story