హైదరాబాద్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం కారణంగా ప్రియుడితో కలిసి తన భర్తను హత్య చేసిందో భార్య. ఈ ఘటన అల్లపూర్ పరిధిలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన పలు వివరాలు ఇలా ఉన్నాయి. అల్లాపూర్ రాజీవ్గాంధీ నగర్లో మహ్మద్ షాదుల్ -తబ్సుమ్ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఒక కుమార్తె ఉంది. ఇదిలా ఉంటే.. నాలుగేళ్ల క్రితం తబ్సుమ్కు తాఫిక్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. అది వివాహేతర సంబంధంగా మారింది.
విషయం తెలిసి భర్త మందలించాడు. అప్పటి నుంచి తరచూ కుటుంబంలో గొడవలు జరిగేవి. ఈ క్రమంలోనే భర్తను హత్య చేయాలని తబ్సుమ్ ప్లాన్ వేసింది. ఎలాగైనా భర్తను వదిలించుకోవాలని ఆగస్టు 15వ తేదీన షాదుల్ పడుకున్నప్పుడు ఇద్దరూ కలిసి కొట్టి, దిండుతో ముక్కు, నోరు మూసి చంపారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆగస్టు 17న నిందితులు తౌఫిక్, తబస్సుమ్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.