భర్తకు భోజనంలో మత్తుమందు కలిపి.. ప్రియుడితో కలిసి ఎంత దారుణానికి పాల్పడిందంటే..!

Wife Killed Husband Along With Boy Friend. జోగులాంబ గద్వాల జిల్లా అమరచింత మండలం నందిమల్ల గ్రామంలో దారుణం చోటుచేసుకుంది.

By Medi Samrat  Published on  5 Oct 2021 2:10 PM GMT
భర్తకు భోజనంలో మత్తుమందు కలిపి.. ప్రియుడితో కలిసి ఎంత దారుణానికి పాల్పడిందంటే..!

జోగులాంబ గద్వాల జిల్లా అమరచింత మండలం నందిమల్ల గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ప్రియుడి కోసం భర్తను చంపించింది ఓ మహిళ..! అయితే.. పోలీసులు తమదైన స్టైల్ లో విచారణ చేయడంతో ఆమె చేసిన దారుణం మొత్తం బయట పడింది. అమరచింత మండలం నందిమల్ల గ్రామానికి చెందిన రాజుతో మాధవికి వివాహం అయింది. వివాహానికి ముందే మాధవికి కలవలదొడ్డి గ్రామానికి చెందిన మునేష్ అనే వ్యక్తితో పరిచయం ఉంది. వివాహానంతరం కూడా మాధవి అతనితో అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తూ ఉండడంతో ఈ విషయం భర్త రాజుకు తెలిసింది. దీంతో వారిద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి.

ఈ క్రమంలో భర్తను అడ్డుతొలగించుకోవాలనుకుని తన ప్రియుడు మునేష్ కు చెప్పింది. ఇద్దరూ కలిసి రాజును తప్పించాలని భావించారు. దీంతో అక్టోబర్ 2వ తేదీ రాత్రి రాజుకు అన్నం పెట్టింది. అయితే ఆ భోజనంలో మత్తు ట్యాబ్లెట్లు ఉన్నాయని తెలీదు. రాజు మత్తులోకి జారుకోగానే ప్రియుడు మునేష్ కు ఫోన్ చేయగా.. మునేష్ కుంటి జైపాల్, బోయ రవి, రవీంద్రలతో అక్కడకు చేరుకున్నాడు. వారు ఐదుగురు కలిసి రాజు మెడకు తాడు బిగించి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. హత్యను ప్రమాదంగా చిత్రీకరించటానికి శవాన్ని తీసుకువెళ్లి పొలం దగ్గర ఉన్న ట్రాన్స్ ఫార్మర్ వద్ద పడేసి వెళ్లిపోయారు.

సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్ధలానికి చేరుకున్నారు. మృత దేహాన్ని పరిశీలించిన పోలీసులకు అనుమానాలు రావడంతో దర్యాప్తు చేపట్టారు. భార్య మాధవిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. దీంతో పోలీసుల దర్యాప్తులో మాధవి అసలు విషయం తెలిపింది. తనను వేధింపులకు గురిచేశాడని అందుకే భర్తను ప్రియుడితో కలిసి హత్య చేసినట్లు ఒప్పుకుంది. హత్యకు సహకరించిన మిగిలిన వారిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.


Next Story