రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఇంటి ముందు పార్క్ చేసిన కారులో ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులు ఊపిరాడక మృతి చెందారు. వివరాళ్లోకి వెళితే.. చేవెళ్ల మండలం దామరగిద్దకు చెందిన దంపతులకు తన్మయశ్రీ (5), అభినయశ్రీ (4) కూతుర్లు ఉన్నారు. అయితే ఈ ఇద్దరు అక్కాచెల్లెళ్లు సోమవారం ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న కారులో ఆడుకుంటుండగా కారు డోర్ ఆటోమెటిక్గా లాక్ పడింది.
చిన్నారులు కారులో ఇరుక్కుపోయిన విషయాన్ని ఎవరూ గమనించలేదు. దీంతో కారులో నుంచి బయటకు వచ్చేందుకు చాలాసేపటి దాకా ప్రయత్నించారు. కానీ ఫలితం లేకపోయింది. ఈ క్రమంలోనే ఊపిరాడక ఇద్దరు చిన్నారులు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. కాగా, పిల్లలు కనిపించడం లేదని తల్లిదండ్రులు వెతగ్గా, కారులో విగతజీవులుగా మారిన చిన్నారులు కనిపించారు. కారులో నిర్జీవంగా పడివున్న చిన్నారులను చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.