సంగారెడ్డి జిల్లాలో ఊహించని విషాదం

సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేట మండలంలోని కొలుకురు గ్రామంలో ఊహించని విషాదం చోటు చేసుకుంది.

By Medi Samrat  Published on  21 Oct 2023 12:38 PM GMT
సంగారెడ్డి జిల్లాలో ఊహించని విషాదం

సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేట మండలంలోని కొలుకురు గ్రామంలో ఊహించని విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఒకే రోజు మరణించారు. కొలుకురు గ్రామానికి చెందిన ఈటల రమణ (45), ఎంపల్లి మల్లేష్ (30), మంగలి గోపాల్ (30) ముగ్గురు తలా ఒక ట్రాక్టర్ కొనుక్కొని జీవనం సాగిస్తున్నారు. ఈటల రమణకి చెందిన ట్రాక్టర్ ట్రాలీ టైర్ శనివారం పంక్చర్ అయింది. ఆ టైర్ ను గోపాల్ కు చెందిన ట్రాక్టర్ లో వేసుకొని సదాశివపేటలో పంక్చర్ వేయించడానికి ముగ్గురు కలిసి బయలుదేరారు.

సింగూరు కాలువ మీదుగా సదాశివపేట పట్టణం వైపు వెళ్తుండగా, ట్రాక్టర్ అదుపుతప్పి సింగూరు కాలువలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ మీద ఉన్న ముగ్గురు కూడా ఇంజిన్ కింద పడి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. జేసీబీ సాయంతో ట్రాక్టర్ ను బయటకి లాగారు. ట్రాక్టర్ కింద ఇరుక్కొన్న మృతదేహాలను బయటికి తీశారు. ఒకే రోజు గ్రామంలో ముగ్గురు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. వారి కుటుంబాలను ఆదుకోవాలని గ్రామస్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Next Story