నా భర్త కామపిశాచి.. లేదు, నా భార్య అక్రమ సంబంధం పెట్టుకుంది
టెక్ వ్యవస్థాపకుడు ప్రసన్న శంకర్ సోషల్ మీడియాలో సంచలన ఆరోపణలు చేశారు.
By Medi Samrat
టెక్ వ్యవస్థాపకుడు ప్రసన్న శంకర్ సోషల్ మీడియాలో సంచలన ఆరోపణలు చేశారు. తన నుండి విడిపోయిన భార్య, చెన్నై పోలీసులు తనను వేధిస్తున్నారని ఆరోపించారు. తిరుచ్చిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి పట్టభద్రుడయిన శంకర్, సింగపూర్కు చెందిన క్రిప్టో సోషల్ నెట్వర్క్ 0xPPL.com వ్యవస్థాపకుడు. తన భార్యకు వివాహేతర సంబంధం ఉందని తెలుసుకున్న తర్వాత తనకు కష్టాలు ఎదురయ్యాయని ఆరోపించాడు. తన భార్య ద్రోహానికి ఆధారాలు దొరికిన తర్వాత, ఆమె విడాకుల కోసం భారీగా పరిహారాన్ని కోరిందని శంకర్ పేర్కొన్నాడు. చర్చలు నిలిచిపోయినప్పుడు, ఆమె తనపై గృహ హింస ఆరోపణలు చేస్తూ తప్పుడు పోలీసు ఫిర్యాదు దాఖలు చేసిందని ఆరోపించాడు. భారతదేశంలో కాకుండా అమెరికాలో విడాకుల కోసం దాఖలు చేయడం ద్వారా ఆమె ప్రయోజనం పొందడానికి ప్రయత్నించిందని, ఎందుకంటే భారతదేశంలో తాను విడాకులకు దరఖాస్తు చేసుకున్నానని కూడా అతను చెప్పాడు.
ప్రసన్న శంకర్ నారాయణ, దివ్య దంపతులు. వారికి తొమ్మిదేళ్ల కుమారుడు ఉన్నాడు. కొంతకాలంగా వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో అమెరికా కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలైంది. దివ్య, ఆమె కుమారుడు అమెరికా పౌరులు. ఒప్పందంలోని నిబంధనల ప్రకారం, అతను తన భార్యకు సుమారు రూ.9 కోట్ల రూపాయలు, అలాగే నెలకు రూ.4.3 లక్షలు చెల్లించాల్సి ఉంది, అదే సమయంలో వారి కొడుకు ఇద్దరి కస్టడీలో ఉండాలి. తన భార్య దివ్యకు వివాహేతర సంబంధం ఉందని, ఈ విషయమై గొడవలు జరిగాయని అంటున్నాడు ప్రసన్న. తన కుమారుడిని కిడ్నాప్ చేసినట్టు దివ్య ఫిర్యాదు చేసిందని, అంతర్జాతీయ పిల్లల అక్రమ రవాణాకు సంబంధించిన సెక్షన్లతో కేసు నమోదైందని తెలిపాడు. అమెరికా పోలీసులు, కోర్టు ఈ ఆరోపణలను విచారించి, అవి నిరాధారమైనవని తేల్చి తనకు అనుకూలంగా తీర్పునిచ్చాయన్నాడు. ఆ తర్వాత కూడా నేను దాడి చేసి అత్యాచారం చేసినట్టు, నగ్న వీడియోలు సర్క్యులేట్ చేస్తున్నట్టు దివ్య తనపై సింగపూర్ లో ఫిర్యాదు చేయగా, సింగపూర్ పోలీసులు తనకు క్లీన్ చిట్ ఇచ్చారని తెలిపాడు.
అమెరికా కోర్టు ప్రసన్నకు ప్రతి వారాంతంలో కుమారుడితో గడిపేందుకు అనుమతినిచ్చింది. వారం క్రితం దివ్య తన కుమారుడితో అమెరికా నుంచి చెన్నైకి వచ్చింది. అమెరికా కోర్టు ఆదేశాల మేరకు, ప్రసన్న తన స్నేహితుడు గోకుల్ ద్వారా కుమారుడిని వీకెండ్ లో తీసుకువెళ్ళాడు. అయితే, దివ్య తన కుమారుడిని ప్రసన్న కిడ్నాప్ చేశాడని చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే కుమారుడు తనతో సంతోషంగా ఆడుకుంటున్నాడని ప్రసన్న సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు. దివ్య ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదు చేయని పోలీసులు, డబ్బుల కోసం డిమాండ్ చేశారని ప్రసన్న ఆరోపించారు. కొడుకును కిడ్నాప్ చేసినట్టు తన భార్య దివ్య ఫిర్యాదు చేయడంతో, ప్రస్తుతం తాను చెన్నై పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్నానని. పోలీసులు ట్రాక్ చేస్తున్నారని ప్రసన్న శంకర్ వాపోయాడు. ప్రసన్న శంకర్ ఒక కామ పిశాచి అని దివ్య సంచలన ఆరోపణలు చేశారు. రహస్యంగా మహిళల వీడియోలు రికార్డు చేసేవాడని తెలిపారు. ఈ కారణంగానే అతడు సింగపూర్ లో అరెస్టయ్యాడని, ఆ తర్వాత విడుదలయ్యాడని చెబుతున్నారు. ఏది ఏమైనా వీరి వ్యవహారం ప్రస్తుతం రచ్చకెక్కింది.