చిత్తూరు జిల్లాలో దొంగతనం చేసి పట్టుబడ్డ పోలీసు.. అలా ప్రాణాలను వదిలాడు
Suspended ASI Dead In Jail. చిత్తూరు జిల్లాలో ఇటీవలే పోలీసులే దొంగతనం చేసిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం
By Medi Samrat Published on 16 Sept 2021 2:11 PM IST
చిత్తూరు జిల్లాలో ఇటీవలే పోలీసులే దొంగతనం చేసిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రక్షించాల్సిన పోలీసులే ఇలా దొంగతనం చేసి బుక్ అవ్వడం హాట్ టాపిక్ గా మారింది. రిమాండ్ ఖైదీగా ఉన్న ఏఎస్ఐ మహమ్మద్ గుండెపోటుతో ప్రాణాలను వదిలాడు. రిమాండ్ ఖైదీగా ఉన్న సస్పెండెడ్ ఏఎస్ఐ మహమ్మద్ ఈ నెల 4న రోడ్ సైడ్ బట్టల దుకాణంలో దొంగతనం చేస్తూ రెడ్ హ్యాండెడ్గా కానిస్టేబుల్తో పాటు దొరికి అరెస్టయ్యారు. ఎస్పీ అదేశాల మేరకు దొంగతనం కేసులో ఇరువురిని సస్పెండ్ చేసి, చిత్తూరు జిల్లా జైలులో రిమాండ్కు తరలించారు. బుధవారం జైలులో మహమ్మద్కు గుండెపోటు రావడంతో జైలు అధికారులు చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మహమ్మద్ మృతి చెందారు.
కలెక్టరేట్ రోడ్ లోని ఒక ఒమిని వ్యాన్ వద్ద ఉంచిన బట్టల్ని దొంగలిస్తూ మహమ్మద్ అడ్డంగా దొరికిపోయాడు. ఓ వ్యక్తి పీవీకేఎన్ కళాశాల నుంచి కలెక్టరేట్ కు వెళ్లే మార్గంలో ఒమిని వ్యానులో దుస్తుల వ్యాపారాన్ని ప్రారంభించాడు. రోజూ పని ముగించుకున్న అనంతరం.. దుస్తులు అన్నీ మూటగట్టి.. తాడుతో కట్టి వెళ్లేవాడు. మరుసటిరోజు వచ్చి చూసేసరికి స్టాక్ తక్కువగా ఉందని అనిపించింది. సీసీటీవీ కెమెరాల్లో మొత్తం దొంగతనం బయటపడింది. కానిస్టేబుల్ను, ఏఎస్ఐ దొంగతనం చేయడం స్పష్టంగా కనిపించింది. కానిస్టేబుల్ తో పాటు సివిల్ డ్రెస్లో ఏఎస్ఐ కూడా అక్కడే ఉండి ఈ దొంగతనం చేశారు. ద్విచక్ర వాహనంలో వచ్చినవారిలో ఒకరు కానిస్టేబుల్ కాగా, సాధారణ దుస్తుల్లో మరో వ్యక్తి ఏఎస్ఐ మహమ్మద్గా గుర్తించి సస్పెండ్ చేశారు పోలీసు అధికారులు.