ప్రైవేటు సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసుకు సంబంధించి పోలీసులు కీలక వివరాలు వెల్లడించారు. సుపారీ గ్యాంగ్ సాయంతో భర్త తేజేశ్వర్ను హత్య చేయించినట్లు గద్వాల ఎస్పీ మీడియాకు తెలిపారు. జూన్ 17న తేజేశ్వర్ అదృశ్యమైనట్లు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం ఈ నెల 21న గాలేరు-నగరి కాల్వలో తేజేశ్వర్ మృతదేహం లభ్యమైందని ఎస్పీ తెలిపారు.
ఐశ్వర్య తన ప్రియుడు తిరుమల్రావుతో కలిసి తేజేశ్వర్ను అంతమొందించాలని పక్కా ప్లాన్ వేసింది. ఇందుకోసం వారు సుపారీ గ్యాంగ్ను ఆశ్రయించారు. పథకం ప్రకారం ముగ్గురు వ్యక్తులు కలిసి తేజేశ్వర్ను కారులో బలవంతంగా తీసుకెళ్లి హత్య చేశారని ఆయన తెలిపారు. నిందితుడు తిరుమల్రావుకు హత్యకు గురైన తేజేశ్వర్ భార్య ఐశ్వర్య తల్లితో కూడా వివాహేతర సంబంధం ఉందని ఆయన వెల్లడించారు. ఐశ్వర్యను రెండో పెళ్లి చేసుకోవాలనే దురుద్దేశంతోనే తిరుమల్రావు ఈ హత్యకు ప్రణాళిక రచించినట్లు ఎస్పీ వివరించారు.