ఇంట్లో భారీ అగ్నిప్రమాదం.. గర్భిణి, చిన్నారి సహా ఆరుగురు స‌జీవ ద‌హ‌నం

బీహార్‌లోని రోహతాస్‌లోని ఓ ఇంట్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఇందులో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు

By Medi Samrat  Published on  9 April 2024 1:27 PM GMT
ఇంట్లో భారీ అగ్నిప్రమాదం.. గర్భిణి, చిన్నారి సహా ఆరుగురు స‌జీవ ద‌హ‌నం

బీహార్‌లోని రోహతాస్‌లోని ఓ ఇంట్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఇందులో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు. ఈ ప్ర‌మాదంలో ఒకరు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. అతడిని చికిత్స నిమిత్తం సదర్‌ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన కచ్వాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇబ్రహీంపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. వంట చేస్తుండగా ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయని ప్రజలు చెబుతున్నారు. మంటలు అదుపులోకి వచ్చే సమయానికి కుటుంబంలోని ఆరుగురు మృతి చెందారు. వీరిలో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు. అంతేకాదు ఈ ఘ‌ట‌న‌లో ఇల్లు మొత్తం కాలి బూడిదైంది.

ఈ ఘటనతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది. ఘ‌ట‌న‌తో ఒక్క‌సారిగా సమీపంలో జనం గుంపుగా గుమికూడారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక యంత్రాల సాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. పోలీస్-అడ్మినిస్ట్రేషన్ టీమ్ సహాయక చర్యల్లో బిజీగా ఉన్నాయి. మరణించిన వారిలో 30 ఏళ్ల పుష్పా దేవి, ఆమె ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు మోహన్ కుమార్, గర్భవతి అయిన కోడలు 25 ఏళ్ల మాయా దేవి ఉన్నారు.

ఈ కేసులో షార్ట్‌సర్క్యూట్‌ వల్లే ఇంట్లో మంటలు చెలరేగాయని కచ్వాన్‌ పోలీస్‌ స్టేషన్‌ అధికారి తెలిపారు. ఈ ప్రమాదంలో గర్భిణి, చిన్నారి సహా ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు. పోలీసులు మృతదేహాల‌ను అదుపులోకి తీసుకుని పోస్టుమార్టం నిమిత్తం సదర్‌ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో ర‌కిని 95 శాతం కాలిన గాయాలయ్యాయని, చికిత్స నిమిత్తం అంబులెన్స్‌లో ససారం సదర్ ఆసుపత్రికి తరలించామని సివిల్ సర్జన్ డాక్టర్ కెఎన్ తివారీ తెలిపారు.

Next Story