ఆత్మహత్య చేసుకున్న‌ అక్కా చెల్లెళ్లు

అక్కాచెల్లెళ్లు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది.

By Medi Samrat  Published on  2 Feb 2024 12:29 PM GMT
ఆత్మహత్య చేసుకున్న‌ అక్కా చెల్లెళ్లు

అక్కాచెల్లెళ్లు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. శెట్టూరు మండలం యాటకల్లుకి చెందిన జ్యోతి, రూప అక్కాచెల్లెళ్లు.. వారి ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. గ్రామంలో అందరితో కలిసి మెలిసి ఈ అక్కాచెల్లెళ్ళు ఉండేవారని స్థానికులు తెలిపారు. అలాంటిది వీరు ఇలాంటి నిర్ణయం తీసుకుంటారని అసలు ఊహించలేదన్నారు.

యాటకల్లు గ్రామానికి చెందిన చాకలి నారాయణస్వామికి ఇద్దరు భార్యలు. మొదటి భార్య మృతిచెందడంతో రెండవ భార్య సరస్వతిని 22 సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నాడు. మొదటి భార్యకు కుమారుడు మనోజ్, రెండవ భార్య సరస్వతికి ఇద్దరు కుమార్తెలున్నారు. చాకలి రూప (18) చాకలి జ్యోతి (20)లు అనంతపురంలో ఒక కళాశాలలో డిగ్రీ చదువుతున్నారు. ఇటీవల గ్రామానికి వచ్చిన అక్కాచెల్లెళ్లు రూప, జ్యోతిలు ఇంట్లోనే ఉండేవారు. బయటికి వెళ్లేవారు కాదు. శుక్రవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story