జడ్చర్ల మండలం మాచారం సమీపంలో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఏకంగా యాసిడ్ ట్యాంకర్ ను ఢీ కొట్టింది. జాతీయ రహదారి (ఎన్ హెచ్) 44 పై చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. చిత్తూరు నుంచి హైదరాబాద్ వస్తున్న ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి ముందు వెళుతున్న యాసిడ్ ట్యాంకర్ ను ఢీకొట్టింది. దీంతో ట్యాంకర్ లో నుంచి భారీగా పొగలు వెలువడ్డాయి. ఆ సమయంలో బస్సులో 26 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఆకస్మిక పరిణామంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే బస్సు కిటికీలు పగలగొట్టుకుని బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పొగలను అదుపులోకి తీసుకు వచ్చారు. ఈ ఘటనలో ప్రయాణికులు ఎవరికీ ఏం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.