కంబోడియాకు అక్రమంగా భారతీయ మొబైల్ సిమ్ కార్డులను పంపుతున్న ముఠాను తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) అరెస్ట్ చేసింది. సైబర్ మోసగాళ్లు ఈ సిమ్ కార్డుల ద్వారా భారతదేశ వ్యాప్తంగా ఉన్న ప్రజలను మోసం చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠా 2023 నుంచి కంబోడియాకు రహస్యంగా 600 కు పైగా భారతీయ సిమ్ కార్డులను తరలించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ సిమ్ కార్డులను ఉపయోగించి ఫిషింగ్, ఫేక్ కాల్స్, ఐడెంటిటీ థెఫ్ట్, బెదిరింపులు వంటి ఆన్లైన్ నేరాలకు పాల్పడి కోట్లాది రూపాయలు కాజేసినట్లు దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు.
మార్చి 31వ తేదీన హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (శంషాబాద్) లో సయ్యద్ అష్రఫ్ అలీ అనే నిందితుడిని అదుపులోకి తీసుకోవడంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. అతడు తన లగేజీలో 198 సిమ్ కార్డులను దాచిపెట్టి కంబోడియాకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. అనంతరం అతడిని టీజీసీఎస్బీ (TGCSB) అధికారులకు అప్పగించారు. ఉత్తరప్రదేశ్కు చెందిన రిజ్వాన్ అనే వ్యక్తి నేతృత్వంలో ఈ ముఠా నడుస్తోందని బయటపెట్టాడు. కంబోడియాలో పనిచేస్తున్న ఫ్రాడ్ సిండికేట్తో రిజ్వాన్కు సంబంధాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు.
అమాయకులైన ప్రజల గుర్తింపు పత్రాలను దుర్వినియోగం చేస్తూ, నకిలీ పత్రాలతో ఈ సిమ్ కార్డులను పొందినట్లు పోలీసులు గుర్తించారు. అరెస్టయిన వారిలో ముగ్గురు ఎయిర్టెల్ (Airtel), జియో (Jio) పాయింట్ ఆఫ్ సేల్ సెంటర్లను నడుపుతున్నారని, వీరు కావాలనే ఈ ముఠాకు యాక్టివ్గా ఉన్న సిమ్ కార్డులను సరఫరా చేశారని పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో కొరియర్గా పనిచేసిన అరవింద్ కుమార్ అనే మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. ప్రజలు పేరు మీద ఏవైనా తెలియని సిమ్ కార్డులు జారీ అయ్యాయో లేదో తెలుసుకోవడానికి 'సంచార్ సాథి' (Sanchar Saathi) వెబ్సైట్ను తనిఖీ చేసుకోవాలని సైబర్ సెక్యూరిటీ బ్యూరో సూచించింది.