ఫేస్బుక్లో స్నేహం చేసి సైబర్ దుండగులు రిటైర్డ్ ఉద్యోగి అసభ్యకరమైన వీడియో తీశారు. దీని తర్వాత అతడి నుంచి రూ.36 లక్షలు కాజేశారు. ఈ విషయమై బంధువులు బాధితుడితో కలిసి పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు సైబర్స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
కొంతకాలం క్రితం షాహ్గంజ్లో నివసిస్తున్న రిటైర్డ్ ఉద్యోగికి ఫేస్బుక్లో ఒక అమ్మాయి నుండి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. ఆయన ఆ రిక్వెస్ట్ను కన్ఫర్మ్ చేశాడు. ఆపై వృద్ధుడితో స్నేహం చేసిన సైబర్ దుండగులు అతని అసభ్యకరమైన వీడియో తీశారు. అనంతరం వీడియో ఆధారంగా అతడిని బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించారు. సీబీఐ అధికారినని బెదిరించి జైలుకు పంపుతామని హెచ్చరించారు.
దీంతో బాధితుడు రూ.36 లక్షలు పలుమార్లు దుండగులకు పంపాడు. విషయం తెలుసుకున్న బంధువులు వృద్ధుడిని సైబర్ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ రీటా యాదవ్ తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
AI సహాయంతో తనపై అసభ్యకరమైన వీడియో తీశారని బాధితుడు పోలీసులకు చెప్పాడు. ఆ వీడియోను ప్రసారం చేస్తే ఇంట్లో, సమాజంలో తన సామాజిక ప్రతిష్ట పోతుందని భయపడ్డానని.. మోసగాళ్ల వలలో పడి వారి డిమాండ్ మేరకు డబ్బులు ఇచ్చానని పేర్కొన్నాడు. దుండగుల డిమాండ్లను నెరవేర్చిన తరువాత కూడా వారు మరింత డబ్బు డిమాండ్ చేయడం ప్రారంభించారని.. రకరకాలుగా బెదిరించారని వాపోయాడు. ఫిర్యాదు చేస్తూ బాధితుడు పోలీస్ స్టేషన్లో బోరున విలపించాడు. ఈ విషయమై పోలీసులు తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.