డిటెక్టివ్ సినిమా చూసి హత్య.. మృత‌దేహం ఏడు ముక్క‌లు.. వివాహేతర సంబంధమే కారణం.!

Mystery solved in Kampelli Shankar murder case. పెద్దపల్లి జిల్లా రామగుండంలో కలకలం రేపిన మీ సేవ ఆపరేటర్‌ కాంపెల్లి శంకర్‌ హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

By అంజి  Published on  30 Nov 2021 2:42 AM GMT
డిటెక్టివ్ సినిమా చూసి హత్య.. మృత‌దేహం ఏడు ముక్క‌లు.. వివాహేతర సంబంధమే కారణం.!

పెద్దపల్లి జిల్లా రామగుండంలో కలకలం రేపిన మీ సేవ ఆపరేటర్‌ కాంపెల్లి శంకర్‌ హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. డిటెక్టివ్‌ సినిమాను అనుసరించి పోలీసులకు సాక్ష్యాలు దొరక్కుండా శంకర్‌ను హత్య చేశాడు. శవాన్ని ఏడు ముక్కలుగా నరికి వేర్వేరు ప్రాంతాల్లో పడేసినట్లు విచారణలో తేలింది. శంకర్‌ హత్యకు ఆయన భార్య హేమలత, భార్య ప్రియుడు పోయిల రాజు మధ్య ఉన్న వివాహేతర సంబంధమే కారణంగా తెలిసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్టీపీసీ ఖాజీపల్లికి చెందిన కాంపెల్లి శంకర్, హేమలత భార్య భర్తలు. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు కూడా ఉన్నారు.

గోదావరిఖనిలో శంకర్‌ మీసేవ కేంద్రంలో ఆపరేటర్‌గా పని చేస్తున్నారు. భార్య హేమలత ఎన్టీపీసీలోని ధన్వంతరి ఆస్పత్రిలో స్టాఫ్‌ నర్సుగా పని చేస్తోంది. కాగా ఇదే ఆస్పత్రిలో పని చేస్తున్న పోయ్యిల రాజుతో హేమలతకు వివాహేతర సంబంధం ఉంది. ఇదే విషయంపై భార్యను భర్త పలు మార్లు హెచ్చరించాడు. దీంతో ఇద్దరి మధ్య తరచూ కలహాలు రేగాయి. ఈ క్రమంలోనే తమ బంధానికి అడ్డుగా ఉన్న కాంపెల్లి శంకర్‌ను చంపాలని ప్రియుడు రాజు నిర్ణయించుకున్నాడు. హత్య చేసేందుకు రెండు కత్తులను సైతం కొనుగోలు చేశాడు. ఈ నెల 25తేదీన మళ్లీ శంకర్‌, హేమలతకు గొడవ అయ్యింది. ఆ తర్వాత రాత్రి 10 గంటలకు శంకర్‌ తన బైక్‌పైన హేమలతను ఆస్పత్రిలో దింపాడు.

రాత్రి 10.30 గంటలకు శంకర్‌ నిందితుడు రాజుకు ఫోన్‌ చేశాడు. నీ వల్లే తమ ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్నాయని, ఇది సరికాదని చెప్పాడు. ఇదే సరైన సమయంగా భావించిన రాజు.. శంకర్‌ను తన ఇంటికి రప్పించుకున్నాడు.. అతి మద్యం తాగించి బీరు సీసాతో శంకర్‌ తలపై బలంగా దాడి చేశాడు. ఆ తర్వాత శంకర్‌ స్పృహ కోల్పోగానే కత్తులతో విచక్షణారహితంగా నరికేశాడు. శంకర్ శరీరాన్ని ఏడు భాగాలుగా చేసి గోదావరిఖని, సప్తగిరికాలనీ, ఆర్టీసీ క్వార్టర్స్‌ వెనుకాల పడేశాడు. ఈ క్రమంలోనే గురువారం రాత్రి బయటకెళ్లిన తన కొడుకు శంకర్‌ ఇంటికి రాకపోవడంతో తల్లి పోచమ్మ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు అదే రోజు హేమలతను అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 27వ తేదీన ఉదయం శంకర్‌ శరీర భాగాలను పోలీసులు గుర్తించి హత్య కేసు నమోదు చేశారు. నిందితుడు రాజును ఆదివారం నాడు బైక్‌పై పారిపోతుండగా పోలీసులు పట్టుకున్నారు.

Next Story