బత్తిన అప్పలరాజుకు మరణ శిక్ష.. ఆరోజు ఆరుగురిని ఇలానే చంపాడు
ఒకే కుటుంబంలో ఆరుగురిని హత్య చేసిన కేసులో విశాఖ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది
By Medi Samrat
ఒకే కుటుంబంలో ఆరుగురిని హత్య చేసిన కేసులో విశాఖ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిందితుడు బత్తిన అప్పలరాజుకు మరణ శిక్ష విధిస్తూ నిర్ణయం తీసుకుంది. 2021 ఏప్రిల్ 15న విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం జుత్తాడ గ్రామంలో బత్తిన అప్పలరాజు బమ్మిడి రమణ కుటుంబానికి చెందిన ఆరుగురిని అత్యంత కిరాతకంగా నరికి చంపాడు. అప్పలరాజు ఈ దారుణానికి ఒడిగట్టడానికి బమ్మిడి రమణ కుమారుడు విజయ్ కిరణ్ కారణమేనని పోలీసులు నిర్ధారించారు.
బత్తిన అప్పలరాజు, బమ్మిడి రమణ ఇరుగు పొరుగు కుటుంబాలే. బత్తిన అప్పలరాజు కుమార్తెను బమ్మిడి రమణ కుమారుడు విజయ్ కిరణ్ ప్రేమించాడు. ఇదే విషయంపై అప్పలరాజు బమ్మిడి రమణ కుటుంబ సభ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2018లో తన కుమార్తెపై విజయ్ కిరణ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, మత్తు మందు కలిపిన పానీయాలు ఇచ్చి ఆమెను మోసం చేసి, వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేశాడంటూ అప్పలరాజు కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విజయ్ను అరెస్టు చేశారు. తన కుమార్తె జీవితం నాశనం కావడానికి, ఊళ్లో తన పరువు పోవడానికి బమ్మిడి రమణ కుటుంబమేనని అప్పల రాజు భావించాడు. విజయ్ ఉషారాణిని పెళ్లి చేసుకుని విజయవాడలో ఉండిపోయాడు.
విజయ్ మేనత్త నక్కెళ్ల అరుణ బంధువు కుమారుడు సాయి వివాహం ఏప్రిల్ 17న, 2021లో శివాజీపాలెంలో జరగనుంది. పెళ్లి విషయం చెప్పడానికి శివాజీపాలెం నుంచి ఏప్రిల్ 14 ఉదయం అరుణ జుత్తాడకు వచ్చింది. పెళ్లికి హాజరయ్యేందుకు విజయవాడ నుంచి విజయ్ కిరణ్ భార్య ఉషారాణి, ఇద్దరు పిల్లలు, తల్లి రమాదేవితో కలిసి గ్రామానికి చేరుకుంది. విజయ్ మాత్రం తన పెద్ద కుమారుడు అఖిల్తో విజయవాడలోనే ఉండిపోయాడు.
ఏప్రిల్ 15 ఉదయం 5.45 గంటల సమయంలో వాకిలి కడిగేందుకు బయటికి వచ్చిన విజయ్ అత్త అల్లు రమాదేవి (63)పై అప్పలరాజు ఈత కల్లు కత్తితో దాడి చేశాడు. మెడపై వేటు పడటంతో ఆమె కుప్పకూలిపోయింది. ఆమె చేతిని కూడా నరికేసి ఇంటి లోపలికి వెళ్లి నిద్రలో ఉన్న విజయ్ భార్య బొమ్మిడి ఉషారాణి (35), ఆమె ఇద్దరు పిల్లలు బొమ్మిడి ఉదయనందన్(02), బొమ్మిడి రిషిత (06 నెలలు)ను కిరాతకంగా హత్య చేశాడు. నిద్రలేచిన విజయ్ మేనత్త నెక్కళ్ల అరుణ (45) బాత్రూమ్లో ఉన్న విజయ్ తండ్రి బమ్మిడి రమణ (63) వద్దకు పరుగులు తీసింది. బాత్రూమ్ డోర్ కొట్టింది. అంతలో ఆమె మెడపై దాడి చెయ్యడంతో రమణ డోర్ తీసిన వెంటనే అరుణ కుప్పకూలిపోయింది. ఆ తర్వాత రమణపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. అందరూ చనిపోయారని నిర్ధారించుకున్న తర్వాత అప్పలరాజు రమాదేవి మృతదేహం పక్కనే కొన్ని నిమిషాల పాటూ కూర్చున్నాడు. ఆ తర్వాత 100 నంబర్కు డయల్ చేసి జుత్తాడ గ్రామంలో ఆరుగురిని చంపేశానని, లొంగిపోతాను అంటూ చెప్పాడు. పెందుర్తి పోలీసులు అక్కడికి వచ్చి అప్పలరాజును అదుపులోకి తీసుకున్నారు.