కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ మండలం కనుకుల గ్రామంలో మంగళవారం మైనర్ ప్రేమికులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. రెండు కుటుంబాలు వేర్వేరు కులాలకు చెందిన వారు కావడంతో పెళ్లి ప్రతిపాదనకు తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో ఇరువురు మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్టు సమాచారం. ఈ విషయమై అబ్బాయి, అమ్మాయి తల్లిదండ్రులు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. వారిద్దరూ మైనర్లు కావడంతో వయోపరిమితిని దృష్టిలో ఉంచుకుని పెళ్లి ప్రతిపాదనపై పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు తల్లిదండ్రులకు, పిల్లలకు కౌన్సిలింగ్ ఇచ్చి ఇళ్లకు పంపించారు.
దీంతో మనస్తాపానికి గురైన శివ అనే మైనర్ బాలుడు సోమవారం విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అతడిని కరీంనగర్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందాడు. శివ మరణించిన వార్త విన్న ప్రియురాలు సుస్మిత వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. శవపరీక్ష నిమిత్తం సుస్మిత మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇరువురి మరణాలతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.