నిజామాబాద్ జిల్లా వ‌రుస‌ హత్యలు.. ఐదుగురు అరెస్ట్

నిజామాబాద్ జిల్లా మాక్లూర్ వరుస హత్యల ఘటనలో ప్రధాన నిందితుడు ప్రశాంత్ సహా ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు కామారెడ్డి ఎస్పీ సింధుశర్మ వెల్లడించారు

By Medi Samrat  Published on  19 Dec 2023 2:08 PM GMT
నిజామాబాద్ జిల్లా వ‌రుస‌ హత్యలు.. ఐదుగురు అరెస్ట్

నిజామాబాద్ జిల్లా మాక్లూర్ వరుస హత్యల ఘటనలో ప్రధాన నిందితుడు ప్రశాంత్ సహా ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు కామారెడ్డి ఎస్పీ సింధుశర్మ వెల్లడించారు. ఎస్పీ సింధుశర్మ మాట్లాడుతూ.. నిందితుల వద్ద కారు, బైక్, ఐదు సెల్ ఫోన్లు, రూ.30 వేల నగదు, భూమి రిజిస్ట్రేషన్ పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సదాశివనగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు ఆధారంగా విచారణ కొనసాగుతోందన్నారు. నవంబర్ 29న మాక్లూర్ మండలంలో ప్రశాంత్, వంశీ, విష్ణు అనే ముగ్గురు వ్యక్తులు కలిసి ప్రసాద్‌ను రాళ్లు, కర్రలతో కొట్టి చంపేశారు. ఆ తర్వాత అక్కడే మృతదేహాన్ని పూడ్చి పెట్టారు. ఆ తర్వాత ప్రసాద్ జైల్లో ఉన్నాడని నమ్మబలికి డిసెంబర్ 1న ప్రసాద్ భార్య శాన్వికను తీసుకువెళ్లి గోదావరిలో తోసేశారని, అదే రోజున ప్రసాద్ చెల్లి శ్రావణిని కూడా తీసుకెళ్లి మెదక్ జిల్లా వడియారం వద్ద తగులబెట్టారని తెలిపారు. ప్రసాద్ వద్దకు వెళదామని చెప్పి అతని తల్లి, పిల్లలు, మరో చెల్లిని కూడా ప్రశాంత్ తీసుకువచ్చాడు. తొలుత నిజామాబాద్ లాడ్జిలో ఉంచగా.. ఆ తర్వాత డిసెంబర్ 4న ప్రశాంత్ ఆ పిల్లల్ని చంపేశాడు. వారిని మెండోరా వద్ద సోన్ బ్రిడ్జి వద్ద నీళ్లలో పడేశాడు. డిసెంబర్ 13న మరో చెల్లి స్వప్నను పెట్రోల్ పోసి తగులబెట్టారు. తమ కుటుంబ సభ్యులు ఎంతకూ రాకపోవడంతో ప్రసాద్ తల్లి లాడ్చి నుంచి పారిపోయి.. పోలీసులను ఆశ్రయించింది. ఆమె కోసం వచ్చిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఇప్పటి వరకు నాలుగు మృతదేహాలు లభ్యమయ్యాయని, ప్రసాద్, అతని భార్య మృతదేహం ఇంకా దొరకలేదని పోలీసులు తెలిపారు.

డిసెంబర్ 14న నిజామాబాద్‌లోని సదా శివనగర్‌లో గుర్తుతెలియని మహిళ మృతదేహాన్ని పోలీసులు గుర్తించడంతో కేసు వెలుగులోకి వచ్చింది. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారని తెలియడంతో స్థానికులు షాక్ అయ్యారు. మాచారెడ్డిలోని ప్రసాద్ ఇంటిని ఆక్రమించాలనే ఉద్దేశంతో అతడి స్నేహితుడే ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

Next Story